సినీ నటి, మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ తెలంగాణలో వైసీపీలో చేరారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సమక్షంలో జయసుధ వైసీపీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కార్యాలయంలో ఆమె జగన్ ను కలిశారు. ఆయన పార్టీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.
తర్వాత జయసుధ మీడియా వాళ్లతో మాట్లాడుతూ ఆసక్తికరమయిన విషయాలు చెప్పారు. టీఆర్ఎస్ ఒత్తిడితో తాను టిడిపి వదలి వైసీపీలో చేరలేదని స్పష్టం చేశారు.తనకు సినిమా తప్ప హైదరాబాద్లో ఎలాంటి వ్యాపారాలు లేవని వెల్లడించారు.
ప్రఖ్యాత సాహితీ వేత్త నిడదవోలు వెంకటరావు మనవరాలు అయిన జయసుధ మద్రాసులో జన్మించారు. 250 సినిమాలకు పైగా నటించారు.
వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఓ రకంగా సొంత ఇంటికి చేరినట్లు అనిపిస్తోందని అన్నారు. కోస్తాంధ్ర నుంచి ఆమెను జగన్ ఎన్నికల్లో నిలబెట్టే అవకాశం ఉందని, వీలయితే ఆమెను రాజమండ్రి నుంచి ఎంపిగా నిలబెట్టవచ్చని అంటున్నారు. రాజమండ్రి నుంచి తెలుగుదేశం పార్టీ సినిమానటుడు మురళీ మోహన్ ను నిలబెట్టే అవకాశం ఉంది. 2014లో ఆయన టిడిపి తరఫున గెలిచారు. ఈసారి పోటీ చేయనని అంటున్నారు. అయితే, ఆయనను వప్పించే అవకాశం ఉంది. ఆయన మీద జయపద్రను నిలబెడతారేమో నని వైసిపి నాయకుడొకరు తెలుగు రాజ్యం తో అన్నారు.
2016 జనవరిలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల సందర్బంగా ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. అపుడు చంద్రబాబునాయుడిని ప్రశంసంలో ముంచెత్తారు. చంద్రబాబు నాయుడు కృషివల్లే హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ కీర్తి గుర్తింపు వచ్చాయని ప్రశసించారు. అంతకు మునుపు ఆమె 2009 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆమెను ప్రోత్సహించి సికిందరాబాద్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అయితే, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
తెలంగాణ రాష్ట్రం ఎర్పడ్డాక ఆమె టిఆర్ ఎస్ లో చేరవచ్చని అనుకున్నారు. అయితే, ఈ వదంతులను వమ్ము చేస్తూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు.
తెలుగుదేశం పార్టీలో చేరాను గానీ తానేం చేయాలో, విధులేంటో ఎవరూ చెప్పలేదని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు ఉన్నప్పుడు తానేమీ చేయాలో వైఎస్రాజశేఖర్ రెడ్డి చెప్పేవారని గుర్తుచేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ సీటు ఇచ్చి తాను గెలించేందుకు సహకరించింది రాజశేఖర్ రెడ్డి యే నని అన్నారు.ప్రస్తుతానికి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదు. జగన్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు.. అయితే పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు నడుచుకుంటానని పార్టీలో ఉండి గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు.
తాను రాజకీయాల్లోకి రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డియే కారణం చెబుతూ ఇపుడు వైఎస్సార్ సీపీలోకి రావడం మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అని ఆమె వ్యాఖ్యానించారు.
