హాట్ న్యూస్ : బాలినేని-కరణం భేటీ..జిల్లాలో ఏం జరుగుతోంది ?

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఏమి జరుగతోందో అర్ధంకాక తెలుగుదేశంపార్టీ నేతలు జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా వైసిపి ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డితో టిడిపి ఎంఎల్సీ కరణం వెంకటేష్  భేటీ అవ్వటమే అందుకు ప్రధాన కారణం. ఓ పుట్టినరోజు ఫంక్షన్లో ఇద్దరు నేతలు కలుసుకుని చర్చలు జరపటమే జిల్లాలో చర్చకు దారితీసింది. వెంకటేష్ అంటే కరణం బలరామ్ కొడుకన్న విషయం అందరికీ తెలిసిందే. కరణం బలరామ్ కు చాలా కాలంగా జిల్లా నేతలతో ఏమాత్రం పడటం లేదు. చంద్రబాబుతో కూడా మునుపటిలా సఖ్యత లేదు. ఈ మొత్తానికి ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ ప్రధాన కారణం.

 

ఎప్పుడైతే గొట్టిపాటి తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించారో అప్పటి నుండి కరణం, గొట్టిపాటికి గొడవలు మొదలయ్యాయి. మొదటి నుండి పై ఇద్దరు నేతలకు మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. అప్పట్లో ఇద్దరు నేతలు చెరో పార్టీల్లో ఉండేవారు కాబట్టి విభజన స్పష్టంగా ఉండేది. అలాంటిది ఎప్పుడైతే గొట్టిపాటి టిడిపిలోకి ఫిరాయించారో వారిద్దరి మధ్య గొడవలో మిగిలిన నేతలు ఇరుక్కున్నారు. ముందు జిల్లాలోని నేతల్లో మెజారిటీ కరణంకు మద్దతుగా నిలబడ్డారు. అయితే, చంద్రబాబు, చినబాబులు గొట్టిపాటికి మద్దతుగా నిలబడ్డారో జిల్లాలోని నేతలు కూడా ప్లేటు ఫిరాయించారు. దాంతో కరణం ఒంటరయ్యారు.

 

అప్పటి నుండి జిల్లా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కరణం మాట ఎక్కడా చెల్లుబాటు కావటం లేదు. దాంతో టిడిపిలో ఉండి ఉపయోగం లేదని కరణం నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి కరణం వైసిపిలో చేరిపోతారనే ప్రచారం మొదలైంది. తాజాగా బాలినేనితో కరణం వెంకటేష్ భేటీ కావటంతో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ఎన్నికలు వస్తుండటం మరోవైపు కరణంకు ఎక్కడికక్కడ చుక్కెదురవుతుండటంతో రాజకీయ భవిష్యత్ పై కరణం బలరామ్ తొందరగా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందులో భాగంగానే వెంకటేష్ బాలినేని భేటీ అయ్యుంటారనే ప్రచారం ఊపందుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.