జూనియర్ సైలెంట్ ర్యాగింగ్… కారణం తెలియదా తమ్ముళ్లూ?

కొన్ని సందర్భాల్లో మౌనానికి మించిన ఆయుధం లేదని అంటుంటారు. ప్రతీసారీ మాటే కాదు.. కొన్ని సార్లు మౌనం కూడా విజయం సాధిస్తుందని, సరైన పరిష్కారం చూపిస్తుందని చెబుతుంటారు. అయితే ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మౌనం టీడీపీ నేతలను ర్యాగింగ్ చేస్తుందని ఒకరంటే… కాదు, కాదు, మనసికంగా వేదించేస్తుంది అని మరికొందరు అంటున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైన అనంతరం ప్రముఖుల రియాక్షన్స్ కోసం టీడీపీ శ్రేణులు భారీగా చూశారని అంటున్నారు. ఈ క్రమంలో వేళ్లమీద లెక్క పెట్టేటంత మంది మినహా… తమ్ముళ్లు ఆశించిన స్థాయిలో రియాక్షన్ రాలేదని చెబుతున్నారు. పురందేశ్వరి, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, టీడీపీ నేతలు మినహా స్పందన లేదని అంటున్నారు!

ఇదే సమయంలో అధికారికంగా బీజేపీలో ఉంటూ చంద్రబాబు క్షేమం కోరే మాజీ టీడీపీ నేతలు సైతం ఈ విషయంపై సీరియస్ గానే రియాక్ట్ అయ్యారనే చెప్పుకోవాలి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సంగతి సరేసరి! ఇవన్నీ ఒకెత్తు అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఎవరూ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు. రాఘవేంద్రరావు, అశ్వినీదత్ వంటి టీడీపీ శ్రేయోభిలాషులు, నిర్మాత కే.ఎస్. రామారావు మినహా మరొకరు రియాక్ట్ కాలేని పరిస్థితి!

అయితే సినిమా ఇండస్ట్రీ వేరు, రాజకీయాలూ వేరు.. చంద్రబాబు అరెస్ట్ పై సినిమా జనాలు రియాక్ట్ అవ్వలేదని అనడం పొరపాటు. సినిమా ఇండస్ట్రీకి ఆ అవసరం లేదు, కల్పించుకోదు అన్నస్థాయిలో సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు.

అవన్నీ ఒకెత్తు అయితే… జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై మాత్రం తమ్ముళ్లు తహతహ లాడిపోతున్నారని… ఇప్పటికీ స్పందించకపోవడంతో విలవిల్లాడిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఎంతమంది నిర్మాతలు, దర్శకులూ స్పంందించినా… జూనియర్ స్పందిస్తే ఆ లెక్క టీడీపీకి వేరే స్థాయిలో ఉంటుందనేది వారి బలమైన అభిప్రాయంగా చెబుతున్నారు.

అయితే జూనియర్ మాత్రం మౌనాన్నే తన బాషగా చేసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో అయితే తెలుగుదేశం క్యాడర్ వర్సెస్ జూనియర్ ఫ్యాన్స్ రచ్చ అలా కంటిన్యూస్ గా సాగుతూనే ఉంది. ఈ సమయంలో జూనియర్ దుబాయ్ వెళ్లారు, సైమా తరఫున ఉత్తమ నటుడి అవార్డుని అందుకున్నారు. దీంతో ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యి ఉంటారు.. ఇప్పుడైనా రియాక్ట్ అవుతారని తమ్ముళ్లు ఆశగా చూస్తున్నారని తెలుసుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… జూనియర్ ని ఇప్పుడు స్పందించమని అడుగుతున్న వారికెవరికీ ఆ హక్కు కానీ, నైతిక అర్హత కానీ లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రచారం చేయించుకుని ఆనాక ఆయనను పక్కనపెట్టిన సంఘటనలను గుర్తుకు తెస్తున్నారు. తన సభల్లో జూనియర్ ఫోటోలు కనిపించినా, పాటలు వినిపించినా చంద్రబాబు రియాక్ట్ అయిన విధానం, చేసిన పనులు వీడియోలు వేసి చూపిస్తున్నారు.

అలాంటప్పుడు, అంతలా అవమానించినప్పుడు… జూనియర్ రియాక్షన్ కోసం, ఆయన ఖండన కోసం అడగడం, ఎదురు చూడటం, ఎందుకు రియాక్ట్ అవ్వడంలేదో ఆయననే అడగండి అని అచ్చెన్నాయుడు లాంటి వారు కామెంట్ చేయడం వృథా ప్రయాస, విజ్ఞత లేని ప్రయత్నం అని అంటున్నారు పరిశీలకులు. అచ్చెన్నాయుడితో పాటు టీడీపీ శ్రేణులందరికీ తెలుసు… జూనియర్ మౌనానికి గల కారణాలేమిటి అనేది అని అంటున్నారు విమర్శకులు!