గాలి తీయడంలో సాయిరెడ్డి స్టైలే వేరు… తెరపైకి సుల‌భ్ కాంప్లెక్స్!

ఈ మధ్యకాలంలో టీడీపీ నేతల గాలి తీసి వదిలిపెట్టడంలో వైసీపీ నేతలు మరింత దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి దూకుడు పెంచారు. టీడీపీ నేతలపైనా.. ముఖ్యంగా చంద్రబాబు – లోకేష్ లపైన తనదైన శైలిలో ఫైరవుతున్నారు.

తాజాగా విలేకరులతో మాట్లాడిన విజయసాయిరెడ్డి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వెటకారమాడారు. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నిక‌ల్లో చంద్రబాబు నాయుడు.. కుప్పంలో తాను ఇల్లు క‌ట్టుకుంటున్న వార్డులోనే టీడీపీ మ‌ద్దతిచ్చిన అభ్యర్థిని గెలిపించుకోలేక‌పోయాడ‌ని ఎద్దేవా చేశారు. దీంతో.. ఈ ఒక్కమాట సరిపోదా బాబు పరిస్థితి అంచనా వేయడానికి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఇదే సమయంలో నాలుగు రోజుల వైరల్ అవుతోన్న “చంద్రబాబు రాఖీ” వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో… దానిపై సాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. రాఖీ పంపిస్తాడట.. దాన్ని పూజగదిలో పెట్టి 40 రోజులు పూజించి, చంద్రబాబును తల్చుకుంటే సమస్యలు పరిష్కరిస్తాడట.. ఇలా కూడా ఉంటారా అంటూ ప్రశ్నించారు.

ఫలితంగా… చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే ఆయనకు నిజంగానే మెంటల్‌ వచ్చిందంటూ విమ‌ర్శించారు. చంద్రబాబు 2024లోనే కాదు ఇక ఎన్నడూ అధికారంలోకి రాలేడని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ పేరు మార్చి వెటకారమాడారు విజయసాయిరెడ్డి.

అందులో భాగంగా… టీడీపీ పేరు “జీటీపీ” అని మార్చుకుంటే బాగుంటుందని సాయిరెడ్డి స‌ల‌హా ఇచ్చారు. జీటీపీ అంటే (జి) అంటే గెలిస్తే (టి) అంటే తంతాం (పీ) అంటే పార్టీ అని అర్థం చెప్పారు. గెలిస్తే అందర్నీ తంతాం.. కొడతాం.. బట్టలిప్పుతాం.. గుడ్డలూడదీస్తాం అంటున్నారని, అస‌లు గెలిస్తే క‌దా ఇవ‌న్నీ చేసేది అని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో లోకేష్ ని తనదైన శైలిలో ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఎవరైతే వైఎస్సార్ సీపీని సపోర్ట్‌ చేస్తారో వారితో ఉచ్చ పోయిస్తానని లోకేష్ అంటున్నాడ‌ని.. అలాంటి కోరికే ఉంటే సుల‌భ్ కాంప్లెక్స్ పెట్టుకొని వ్యాపారం చేసుకోవ‌చ్చ‌ని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి!