Vangaveeti Radha: రాధా చేసింది ఒక చారిత్రాత్మక తప్పిదం..!

Vangaveeti Radha: విజయవాడ బెబ్బులి వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధా టీడీపీ (తెలుగుదేశంపార్టీ) లో చేరి చారిత్రకమైన తప్పిదం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో నిన్న (బుధవారం) జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తండ్రిని హత్య చేయించిన పార్టీలో రాధా చేరకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. రంగా హత్య వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వంగవీటి రాధా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే, రంగా కుటుంబం పైన సీఎం వైఎస్‌ జగన్‌కు, తమకు ఎప్పుడూ అదే గౌరవం ఉంటుందని తెలిపారు.

అయితే, తనను హత్య చేసేందుకు నెల కిందట రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా తన తండ్రి 33వ వర్ధంతి సందర్భంగా ప్రకటన చేయడంతో ప్రభుత్వం గన్‌మెన్లను కేటాయించిందని చెప్పారు. అయితే గన్‌మెన్లను వద్దనుకోవడం అనేది రాధా వ్యక్తిగత విషయం అని బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. రాధా చేసిన రెక్కీ ఆరోపణలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారణకు ఆదేశించారని ఆయన తెలిపారు. దొరికిందే సందు అన్నట్టు.. చంద్రబాబు ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాధా ఇప్పటికైనా తండ్రిని చంపిన పార్టీలో కొనసాగడంపై ఒకసారి పునరాలోచించుకోవాలని ఒక మిత్రుడిగా తాను సూచిస్తున్నానని చెప్పారు బాలినేని శ్రీనివాసరెడ్డి.