జగన్ పై దాడి కేసులో హీరో శివాజీకి ఊహించని షాక్

జగన్ పై దాడి కేసులో హీరో శివాజీకి ఊహించని షాక్ తగిలింది. ఆపరేషన్ గరుడ అంటూ శివాజీ గత కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. ఈ ఆపరేషన్ గరుడలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులు అందడం, టీడీపీ నేతలపై ఐటి దాడుల విషయం ఆయన ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టే జరిగింది. దీంతో అప్పటిదాకా ఆయన మాటలని పట్టించుకోని వారంతా ఆలోచనలో పడ్డారు.

అయితే ఇప్పుడు జగన్ పై దాడి గురించి కూడా ఆపరేషన్ గరుడ లో భాగమే అంటూ దాడికి కొద్దీ రోజుల ముందు శివాజీ వెల్లడించారు. ఆయన ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో ప్రతిపక్ష ముఖ్య నాయకుడికి ప్రమాదంలేని పోటు పొడవడం జరుగుతుంది అంటూ తెలిపారు. ఆయన ఆ వీడియో పెట్టిన కొద్ది రోజులకే జగన్ పై దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా శివాజీ ఆపరేషన్ గరుడ చర్చనీయాంశంగా మారింది. జగన్ పై దాడి గురించి స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు… శివాజీ చెప్పినట్టే జరుగుతోంది. ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర. కేంద్ర ప్రభుత్వంతో రహస్య పొత్తు పెట్టుకుని జగన్, మోడీ డ్రామా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ పై దాడి ముమ్మాటికీ అధికార పార్టీ అండదండలతోనే జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. అందుకు చంద్రబాబు ఆపరేషన్ గరుడ స్క్రిప్ట్ రాసారని, శివాజీ అదే చదువుతున్నాడని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆపరేషన్ గరుడలో శివాజీ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని వైసీపీ నేతలు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావుకి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఆపరేషన్ గరుడ జరుగుతోందంటూ వారు ఆరోపించారు.

శివాజీ ఆపరేషన్ గరుడ కుట్రదారుడంటూ, ఆయనపై తగిన చర్య తీసుకోవాలని వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతమ్ రెడ్డిలు కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. తర్వాత మీడియా ఎదుట వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… నటుడు శివాజీని పావుగా ఉపయోగిస్తూ చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేతపై జరిగిన హత్యాయత్నం కూడా ఆ కుట్రలో భాగమే అని ఆరోపించారు.

నిందితుడు శ్రీనివాస్ తో పాటు చంద్రబాబు, శివాజీలను విచారించాలని డిమాండ్ చేశారు. శివాజీ గరుడ పురాణం చెప్పడం, శ్రీనివాస్ హత్యాయత్నం చెయ్యడం, శివాజీ ముందే చెప్పాడంటూ చంద్రబాబు సమర్ధించడం కుట్ర అనేందుకు నిదర్శనం అని తెలిపారు. ఆపరేషన్ గరుడలో జగన్ పై దాడి జరుగుతుందని శివాజీకి ముందే ఎలా తెలుస్తుందని వారు ప్రశ్నించారు. శివాజీకి ముందస్తుగా సమాచారం అందించినవారెవరో బయట పెట్టాలన్నారు. జగన్ పై దాడి కేసులో శివాజీ కుట్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరిపించాలన్నారు.