Ganja Seized: ఆధ్యాత్మిక నగరం తిరుపతిని గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీసులు, జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. గత మూడేళ్లలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన సుమారు 4,100 కిలోల గంజాయిని అధికారులు బహిరంగంగా దహనం చేశారు. దీని విలువ మార్కెట్లో దాదాపు రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా.
ఎర్రంరెడ్డిపాలెం డంపింగ్ యార్డులో ధ్వంసం, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు సమక్షంలో రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెం డంపింగ్ యార్డులో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాళహస్తి, నాయుడుపేట, పుత్తూరు సబ్ డివిజన్ల పరిధిలో మొత్తం 208 కేసుల్లో పట్టుబడిన ఈ గంజాయిని ప్రత్యేక ఎలక్ట్రికల్ యంత్రం సహాయంతో అధికారులు దహనం చేశారు.
గంజాయి అక్రమ రవాణా చేసేవారిపై అవసరమైతే పీడీ (PD) యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. రాష్ట్రంలోనే అత్యధిక పీడీ కేసులు తిరుపతి జిల్లాలోనే ఉండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఈగల్’ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు కలెక్టర్ వివరించారు.

కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువతలో చైతన్యం తీసుకువచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి విశాఖ, కాకినాడ మీదుగా రైళ్లు, బస్సుల ద్వారా చెన్నై, బెంగళూరుకు తరలిస్తున్న ముఠాలను గుర్తించి తనిఖీలు ముమ్మరం చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరుపతి పవిత్రతను కాపాడటం తమ బాధ్యతని పోలీసులు స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక నగరంలో మత్తు పదార్థాలకు తావులేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

