మహిళను వేదింపులకు గురిచేసిన వీఆర్వో… దేహశుద్ది చేసిన బాధితురాలు..!

ప్రస్తుత కాలంలో దేశంలో మహిళలకి రక్షణ కరువైంది. ఇల్లు, స్కూల్, కాలేజ్, ఆఫీస్ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. మహిళల రక్షణకై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహిళల పట్ల వేధింపులు మాత్రం తగ్గటం లేదు. గౌరవ పాదమైన ప్రభుత్వ వృత్తిలో ఉన్నఎంతోమంది ప్రభుత్వాధికారులు కూడా మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. తాజగా అనకాపల్లి లో కూడా ఎటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి స్థలం మంజూరు చేయాలని అభ్యర్థించిన మహిళ పట్ల వీఆర్వో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను వేధింపులకు గురిచేసిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…పి.ఎల్‌.పురం గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తు వీఆర్వో భాస్కరనాయుడు పరిశీలనకు వచ్చింది. దీంతో ఆయన ఆ ధరకాస్తు లో ఉన్న మహిళ ఫోన్‌ నంబర్ కి ఫోన్ చేసి ఇంటి స్థలం మంజూరు చేయాలంటే తనని ప్రేమించాలని, తనతో సహజీవనం చేయమని వేధించడం మొదలుపెట్టాడు. ఇలా తాను చెప్పినట్టు వింటే ఇంటి స్థలం మంజూరు చేస్తానని లేదంటే ఇంటికి స్థలం మంజూరు కాకుండా అడ్డుకుంటానని ఆమెను బెదిరించాడు. అంతేకాకుండా వాట్సాప్ లో కూడా అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తూ ఆమెను వేధింపులకు గురి చేశాడు.

అలాగే ఒకరోజు బాధితురాలికి ఫోన్‌ చేసి.. ‘ఒంటరిగా ఉంటున్నావు.. నాతో సహజీవనం చేస్తే అన్నీ చూసుకుంటాన’ని ఆమెను తీవ్ర వేదింపులకు గురి చేశాడు. చాలాకాలంగా అతని వేధింపులు భరించిన సదరు మహిళ ఇక సహనం కోల్పోయింది. వెంటనే మోత్చా విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకువచ్చింది. దీంతో కుటుంబసభ్యుల సహకారంతో వీఆర్వో వద్దకు వెళ్లి నిలదీసింది. సదరు నిందితుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటంతో బాధిత మహిళ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు వీఆర్వోకు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత ఈ వేధింపుల విషయం గురించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, వీఆర్వోను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.