తల్లి తండ్రుల అజాగ్రత్త వల్ల అభం శుభం తెలియని చిన్నారులు నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి దారుణ ఘటన మండలంలోని బండివెలిగండ్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడాది వయసున్న చిన్నారి నీటి సంపులో పడి మరణించాడు. చిన్నారి మృతితో తల్లి తండ్రులు రోదన వర్ణనాతీతంగా మారింది. వివరాలలోకి వెళితే… బండివెలిగండ్ల ఎస్సీ కాలనీకి చెందిన రావూరి కొండయ్య, మరియమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండేళ్ల క్రితం పెద్ద కుమారుడు మృతి చెందగా ఇటీవల ఏడాది వయసున్న చిన్న కుమారుడు ఉదయ్కిరణ్ కూడా ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి మృతిచెందాడు.
కొండయ్య, మరియమ్మ దంపతులు గేదెల మేత కోసం తమ కుమారుడిని పక్కింటి మహిళకు అప్పగించి వెళ్లారు. అయితే సాయంత్రం 6 గంటల సమయంలో గేదెలు ఇంటికి రావడంతో వాటిని కట్టేందుకు సదరు మహిళ బాలుడిని వదిలిపెట్టి వెళ్ళింది. ఏడాది వయస్సు ఉన్న ఉదయ్కిరణ్ తప్పటడుగులు వేసుకుంటూ నీటి సంపు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిసంపులో పడిపోయాడు. నీటిలో పడిన చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. కొంత సమయం తర్వాత బాలుడు కనిపించకపోవడంతో చుట్టు పక్కల గాలించారు. అనుమానం వచ్చి నీటి సంపులో చూడగా అందులో శవమై కనిపించాడు.
ఈ దారుణ ఘటనతో కొండయ్య, మరియమ్మ దంపతులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. రెండేళ్ల క్రితం పెద్ద కుమారుడు కూడా ఇదే ఇంకుడుగుంతలో పడి మరణించాడు. మరీ ఇప్పుడు ఏడాది వయసున్న చిన్న కుమారుడు కూడా అదే సంపులో పడి మృతి చెందాడు. దీంతో తల్లి తండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి ఉదయ్ కిరణ్ సంపులో పడి మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
