ఆంధ్రకు వచ్చి ప్రధాని మోదీ చేసిన తప్పేమిటంటే…

 

(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)

ప్రధాని నరేంద్రమోదీ గుంటూరు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు ను తిట్టిపోస్తే, దీక్ష పేరుతో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ప్రతిపక్ష పార్టీలన్నింటి చేత మోదీని అంత కంటే ఎక్కువే తిట్టించారు.

రాజకీయాల్లో వ్యక్తులను విస్మరించం లేం, అయితే, వ్యక్తులే రాజకీయం కారాదు. ఇపుడు, రాజకీయాలలో వ్యక్తులే ప్రధానం  అయ్యారు.  ప్రధానినరేంద్ర మోదీ  గుంటూరు కు వచ్చినపుడు చంద్రబాబు వ్యతిరేక పూనకంతో వచ్చారు. ఆయన ప్రసంగమంతా చంద్రబాబును తిట్టడానికే వాడుకున్నారు. చంద్రబాబు మోసగాడని, దోచుకుంటున్నాడని, నారా లకేష్ తండ్రి అని ఎద్దేవా చేయడానికి ఎక్కువ సమయం కేటాయించి ప్రధాని స్థాయిని కూడా చీప్ ప్రాంతీయ పార్టీల లీడర్ల స్థాయికి దిగజార్చారు.

రాష్ట్రంలో ‘ఎన్నికల పర్యటన’ చేస్తున్నపుడు ప్రత్యర్థి ప్రస్తావన వస్తుంది. దాన్నుంచి తప్పుకోలేం. అయితే, వచ్చింది ప్రధాని మంత్రి కాబట్టి, ఆయనకు ప్రాంతీయ పార్టీలకున్నంత కసి అక్కసు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఏ ఒక్క రాష్ట్రం ప్రధాని పదవిని ప్రభావితం చేయలేదు. అందునా బిజెపి నామమాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రం నరేంద్ర మోదీ వంటి ప్రధానిని భయపెట్టరాదు.

ఆయన ప్రధానిగా, కేంద్ర ప్రభుత్వ అధినేత గా రాష్ట్రానికి ఏమి చేయలేకపోయారో ఎందుకు చేయలేకపోయారో, ఎప్పటిలో గా చేస్తారో వివరించాల్సింది ఉండింది. ఆయన డయలాగ్ ప్రజలతో జరగాలి గాని, చంద్రబాబు, ఆయన కుమారుడితో కాదు. ప్రధాని పర్యటనలో నికరంగా ఆంధ్రులకు, ముఖ్యంగా రాయలసీమవాళ్లకు, ఉత్తరాంధ్రవాళ్లకు ఏమిచెప్పాలో అది చెప్పలేదు. ఆంధ్రను డెవలప్ చేస్తాం, అమరావతిని డెవెలప్ చేస్తాం వంటి నిరాకార హామీలు తప్ప ప్రధాని రాష్ట్ర ప్రజలకు ఏమీ ఇవ్వలేకపోయారు.

మోదీని చంద్రబాబు ఆవహించారు. చంద్రబాబులో ఆయన భీకర శత్రువును చూస్తున్నారు. చంద్రబాబులో ఆయన ఒక ప్రమాదాన్ని చూస్తున్నారు. 2014 నాటి వూపు, సందేశం ప్రధానిలో కరువయ్యాయి. అపుడేమో ఆయన గుజరాత్ మోడెల్ ను  నూతన ఆంధ్ర ప్రదేశ్  కు చూపారు. దానికి తోడు తొలిసారి ఆంధ్ర వచ్చినందున, చాలా కాలం కనిపించని సినిమా సూపర్ స్టారొకరు కళ్లముందుకు వచ్చినట్లు ఆంధ్రావాళ్లు ఫీలయ్యారు. ఆయన కూడా ఆంధ్ర తనకు గుజరాత్ తర్వాత ముఖ్యమని భావన కల్పించారు. చాలా హామీలిచ్చారు. వాటిని ప్రజలు స్వీకరించారు. ఇపుడాయన కళ్లలో ఆ ఆకర్షణ లేదు. ఆయన భాషలో ఆ ధీమా లేదు. ఒక ప్రాంతీయ పార్టీ లీడర్ ను ఉతికి ఆరేసేందుకు పూనుకున్నారు. చివరకు తిట్లకు దిగారు. చంద్రబాబును ఒక అసమర్థ కుమారుడి తండ్రిగా ఎగగాళి చేశారు. ఆయన టూర్ చివరకు పనికిమాలిన టూర్ గా మిగిలిపోయింది. అది బిజెపికి తెచ్చేదేమీ ఉండదు. ప్రధాని ఆంధ్ర పర్యటనలో ప్రజలను విస్మరించారు. చంద్రబాబు తప్ప ప్రధానికి ఆంధ్రలో ప్రజలెవరూ కనిపించలేదు.చంద్రబాబును ఉతికి ఆరేశాడని బాబు  వ్యతిరేకులు చప్పట్లు కొట్టొచ్చు, ఈలలు వేయవచ్చు. వాళ్లొరకం ప్రేక్షకులు. మిస్సయిందేమిటో వాళ్లకు కనిపించదు. 

తనను చుట్టుముట్టిన అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు, అబద్ధాల నుంచి తనను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని పర్యటన బాగా ఉపయోగపడింది. ఆయన ప్రధానిని ఇంతవరకు ఎవరూ తిట్టని విధంగా తిట్టిపోస్తున్నారు. ప్రస్తావించడానికి ఎవరూ సాహసించిన ప్రధాని ఎపుడో మర్చిపోయిన భార్యను తెలుగు ప్రజలకు ముందుకు తెచ్చారు. భార్యను వదిలేశాడని, తన ఎదురుగా వున్న మహిళలలో సానుభూతి కొట్టేందుకు ప్రధాని భార్య యశోదా బెన్ జరిగిన అన్యాయాన్ని  బయటకులాగారు. ‘ఫా మిలీ ఫస్ట్, ఫామిలీకి ఏమీ చేయనోడు దేశానికి ఏమి చేస్తాడ’ని కేంద్ర మంత్రి, ప్రధాని పచ్ఛన్న ప్రత్యర్థి అయిన నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు బాగా ఉపయోగించుకున్నారు. కనీసం విడాకులు ఇవ్వకుండా భార్యను వదిలేసినోడు ప్రధాని మోదీ అని తిట్టారు.

ఎన్నికలు సమీపిస్తున్నపుడు చంద్రబాబుకు ఇలాంటి తిట్లాట బాగా అవసరం. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఎపుడూ లేనంత విచిత్రపరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఒంటరి. ఆయనతో కలిసేందుకు ఎవరూ సుముఖంగా లేరు. ఆయన బిజెపితోలేరు కాబట్టి వామపక్షాలు ఆయనతో ఉండాలి. ఇపుడు కమ్యూనిస్టులు ఇపుడు జనసేనతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోరాడాలి. అది ఇబ్బంది పెడుతూ ఉంది.  ఆయన మీద అన్ని వైపులనుంచి దాడి మొదలయింది. దీనితో ఒటర్లను మచ్చిక చేసుకునేందుకు డబ్బును విపరీతంగా ఏదో ఒక స్కీమ్ తో పంపిణీ చేస్తున్నారు. దీక్షల తో వృధా చేస్తున్నారు. చెల్లించాల్సిన బిల్లు లేవీ చెల్లించడం లేదు,అన్ని పక్కన పడేసి, చంద్రబాబు కానుకల కోసం దీక్షల కోసం, జాతీయ ఫ్రంటు పర్యటన  ప్రత్యేక విమానాల కోసం ఖర్చు చేస్తున్నారని సెక్రెటేరియట్ లో వినిపించే మాట.

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్  ప్రజలకు ఇలా చాలా విషయాల్లో సమాధానం చెప్పాల్సి ఉంది. ఆయన 2019లో అధికారం నిలుపుకునేందుు ఎన్ని కుప్పిగంతులువేస్తున్నాడో లెక్కలేదు. ఫేక్ శంకుస్థాపనలు, ప్రారంభాలు చేస్తున్నాడని, పేక్ కృష్ణా వాటర్ పారిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. ఉన్నట్లుండి వృద్ధాప్య పెన్షన్ పెంచాడు, స్వయం సహాయ బృందాలకు భారీ గా చదివింపులందిస్తున్నారు. వాళ్లకి డిజిటల్ ఫోన్లు కొనిపిస్తారు.ఇంకా ఏమేమో చేయబోతున్నారు. ఇలా రాష్ట్రంలో ఇరకాటంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న  చంద్రబాబు ను తిట్టి ప్రధాని మోదీ తన బలహీనతను బయటపెట్టుకోవడమేకాదు,  ఈ సమస్యలనుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబుకు అవకాశమిచ్చారు.

ఇపుడు చంద్రబాబు తాను తిట్టడమేకాదు, దేశంలోని నేతలందరి చేత  మోదీని తిట్టించే క్యాంపెయిన్ మొదలుపెట్టారు.

మోదీ చంద్రబాబును నుద్దేశించి కాకుండా ఏపీ ప్రజల నుద్దేశించి మాట్లాడి ఉంటే ప్రజలు హర్షించేవారు. మోదీ నుంచి రెండు ముఖ్యమయిన విషయాలలో వివరణ రావల్సి ఉండింది. నిజానికి కొన్ని విషయాలను మోదీ మాత్ర మే వెల్లడించగలరు. ముఖ్యంగా రెండు విషయాలలో. ఒకటి, విభజన చట్టం అమలు. విభజన చట్టంలో లోపాలు ఉన్నాయి. అవేవో చెప్పి వాటిని సవరించి తు.చ తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఉండాలి.. చట్టంలో పేర్కొన్న అంశాలు ఏమి వాటిని ఎంత వరకు అమలు చేశారో స్పష్టత ఇచ్చి ఏమేమీ చేయలేకపోయినారో, ఎందుకు చేయలేకపోయినారో చెప్పాల్సి ఉండింది. రెండో అంశం, ప్రత్యేక హోదా. గడిచిన ప్రభుత్వం హోదాను చట్టం లో పేర్కొనలేదు, నిజమే. మేము అమలు చేస్తామన్నారు. చేయలేదు. హోదాను ఇవ్వలేని పరిస్థితి ఏందుకు వచ్చింది, ఆస్థానంలో మీరు చంద్రబాబుకు  అర్థరాత్రి ఇచ్చిన ప్యాకేజి ఏమిటి, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం , కేంద్రం మధ్య కుదిరిన అర్ధరాత్రి అవగాహన ఏమిటి, దాని వెనక జరిగింది ఏమిటనేదాన్ని ప్రజలు ముందు పెట్టాల్సి ఉండింది.

హోదా బదులు ప్యాకేజీ విషయంలోచంద్రబాబుకు, మోదీకి మధ్య కుదిరిన ఒప్పందం బయటపెడితే, ఇద్దరికీ నష్టమే. అందుకే నేమో ప్రధాని మోదీ ప్రజల డిమాండ్లను, వాళ్లేమిఆశిస్తున్నారో వంటి విషయాలజోలికి వెళ్లకుండా చంద్రబాబు ను తిట్టే చవకబారు రాజకీయాలకు పరిమిమయ్యారు. చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఇపుడు ప్రధానితిడుతున్నారు, తిట్టిస్తున్నారు.