కొడంగల్ లో రేవంత్ నామినేషన్, ఉద్రిక్త పరిస్థితి (వీడియోలు)

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి భారీ జనసమీకరణతో నామినేషన్ వేసేందుకు బయల్దేరారు. రేవంత్ రెడ్డి ర్యాలీగా బయల్దేరడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 144 సెక్షన్  అమలులో ఉన్నందున ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. దీంతో కొడంగల్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా భారీ జనసమీకరణతోనే వస్తామని రేవంత్ అనుచరులు అనడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

రేవంత్ రెడ్డి నామినేషన్ కు భారీగా జనం తరలి వచ్చారు. వేలాది మంది కార్యకర్తలు రేవంత్ వెంట నడిచారు. నామినేషన్ వేసేందుకు బయల్దేరే ముందు రేవంత్ పలు దేవాలయాల్లో సతీమణితో కలిసి పూజలు చేశారు. రేవంత్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళహారతులు పట్టి నుదిటిన తిలకం దిద్దారు. 

నామినేషన్ సందర్భంగా ర్యాలీలో రేవంత్ ప్రసంగించారు. కురుక్షేత్రంలో కౌరవుల మాదిరిగా కేసీఆర్ వంద సీట్లు గెలుస్తామంటున్నారని కేసీఆర్ చెబుతున్న వంద సంఖ్య కౌరవులకు సంకేతమన్నారు. కొడంగల్ లోని ఐదు మండలాలు  పంచపాండవులకు సంకేతమన్నారు. తాను భావోద్వేగంతో నామినేషన్ వేశానన్నారు.

తన ప్రాణం ఉన్నంత వరకు కొడంగల్ ప్రజలకు సేవ చేస్తానని రేవంత్ ప్రకటించరు. రాబోయేది కాంగ్రెస్ సర్కారేనని అందులో కొడంగల్ కీలక పాత్ర పోషిస్తదన్నారు. కేసీఆర్ ముఠాలతో కొడంగల్ లో విద్వంసం చేయాలని చూస్తున్నారన్నారు. కొడంగల్ కు తాను హై టెన్షన్ వైరులా పని చేస్తున్నానన్నారు. హరీష్ తనని ముట్టుకొని చూడు మాడి మసై పోతావని రేవంత్ హెచ్చరించారు. పంటల మీద అడవి పందులను వేటాడినట్లు కొడంగల్ ప్రజలు టిఆర్ఎస్ ను తరుముతారన్నారు. కేటిఆర్ ను సీఎం చేయడానికే కేసీఆర్ ఎన్నికలను తెచ్చాడని కేటిఆర్ ని సీఎం చేసి కేసీఆర్ తుది శ్వాస విడవాలనుకుంటున్నారన్నారు.

పూజలు చేస్తున్న రేవంత్ రెడ్డి దంపతులు

 రేవంత్ సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు.  రేవంత్ కు మహా కూటమిలోని నాయకులంతా మద్దతుగా వచ్చారు. దీంతో అన్ని పార్టీల జెండాలతో ర్యాలీ రెప రెపలాడింది. కొడంగల్ జంక్షన్ లో రేవంత్ అనుచరుల పై పోలీసులు లాఠీఛార్జీ చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ తన నామినేషన్ కు వేలాది మంది జనం వస్తారని ర్యాలీకి అనుమతివ్వాలని ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నారు. అయినా కూడా పోలీసులు ర్యాలీకి అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది. రేవంత్  ర్యాలీకి సంబంధించిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.