కాంగ్రెస్ నేత రేవంత్ ఇంటి దగ్గర ఉద్రిక్తత

కాంగ్రెస్ నేత రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రేవంత్ నివాసం సహా 15 చోట్లలో ఐటి అధికారులు దాడులు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తో సహా పలువురు నేతలు రేవంత్ ఇంటికి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు, కార్యకర్తలు నినాదాలు చేసి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరిగింది. కొంత మంది కార్యకర్తలను, నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ నేతలు

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సోదాలు చేయాల్సింది రేవంత్ ఇంట్లో కాదని… కేసీఆర్ నివాసం ఉండే ప్రగతి భవన్ లో సోదాలు నిర్వహిస్తే… వందల కోట్ల రూపాయలు దొరుకుతాయని చెప్పారు. దేశంలో అత్యంత అవినీతికి పాల్పడింది కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు. కాంట్రాక్లర్ల నుంచి కేసీఆర్ కుటుంబం 6 శాతం కమిషన్లను దండుకుందని ఆరోపించారు.

కేంద్ర సంస్థలతో సోదాలను నిర్వహిస్తూ… తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ, అధికార పార్టీ నేతలు తప్పించుకుంటున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ లు విపక్షాలను అణచివేసే కుట్రలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటక మాదిరిగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కేసీఆర్ బెదిరిస్తే భయపడేవారు ఎవరూ లేరని… టీఆర్ఎస్ పై ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పారు. ఇది ప్రభుత్వ దురంహకార చర్య అని జానారెడ్డి విమర్శించారు.