ఏపీ ఎన్నికల్లో పోటి చేయనున్న తెలంగాణ నేత

ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అయితే మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏపీ ఎన్నికల్లో పోటి చేసేందుకు తెలంగాణ నేత,  సీపీఎం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య సిద్దమవుతున్నారు. ఆయన 2014 లో భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో భద్రాచలం నియోజకవర్గంలోని పోలవరం ముంపు మండలాలను పోలవరం ప్రాజెక్టు కింద తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు.

అప్పటి నుంచి ఆయన కేవలం కొన్ని మండలాలకు మాత్రమే ప్రజా ప్రతినిధిగా వ్యవహరించారు. ఆయన నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు ఏపీ ప్రభుత్వం, మరికొన్ని మండలాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయించింది. దీంతో అతను ఏపీ తెలంగాణ రెండు ప్రభుత్వాలకు అనుసంధాన కర్తగా వ్యవహరించారు. తెలంగాణలో  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతను పోటి చేయలేదు. ఏపీలో జనసేన వామపక్షాలకు మద్దతు ప్రకటించింది. దీంతో  సౌమ్యునిగా పేరున్న సున్నం రాజయ్య ఏపీ నుంచి పోటి చేస్తే మద్దతిస్తామని జనసేన ప్రకటించినట్టు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నుంచి సీపీఎం అభ్యర్ధిగా సున్నం రాజయ్య బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. తమతో కలిసి వచ్చే వామపక్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో రెండు సీట్లు కేటాయిస్తామని ఇప్పటికే జనసేన ప్రకటించింది. దీంతో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నుంచి సీపీఎం అభ్యర్ధిగా సున్నం రాజయ్య, పి. గన్నవరం నుంచి సీపీఐ అభ్యర్ధిగా తాటిపాక మధు పోటి చేయనున్నారని తెలుస్తోంది.