టీడీపీ మహానాడు: జూనియర్ ఎన్టీయార్‌కి నో-ఎంట్రీ.!

ఇందులో కొత్తేమీ లేదు.! అందరికీ తెలిసిన విషయమే. జూనియర్ ఎన్టీయార్‌ని మహానాడు పరిసరాల్లోకి కూడా రానివ్వదు తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ పెద్దాయన నందమూరి తారక రామారావునే గెంటేసిన ఘనులు ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు.

ఆ చంద్రబాబుకి బాసటగా నందమూరి బాలకృష్ణ నిలుస్తున్నారు. నారా చంద్రబాబునాయుడు తర్వాత, ఆ పగ్గాలు నారా లోకేష్‌కే దక్కాలని, ‘మేనమామగా’ బాలకృష్ణ కోరుకుంటున్నారు. టీడీపీ స్థాపించింది తన తండ్రి అనీ, నట వారసత్వాన్ని తీసుకున్నట్లే, రాజకీయ వారసత్వాన్నీ తీసుకోవాలనీ బాలకృష్ణ అనుకోరు. అంత పెద్ద మనసు ఆయనది.

బావ బావుండాలి.. మేనల్లుడు ఇంకా బావుండాలి.. ఇదీ బాలకృష్ణ ఆలోచన. ఇక, జూనియర్ ఎన్టీయార్ సంగతేంటి.? ‘అసలు నీది ఎలాంటి పుట్టుక.?’ అని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీయార్‌ని ప్రశ్నిస్తున్న దరిమిలా, మహానాడు సందర్భంగా జూనియర్ ఎన్టీయార్ ప్రస్తావనే అనవసరం.

కానీ, కొందరు జూనియర్ ఎన్టీయార్ అభిమానులకి తెలుగుదేశం పార్టీ మీద మమకారం కూడా వుంటుంది కదా.? ఎవరైనా అలా జూనియర్ ఎన్టీయార్ ఫొటోలతో మహానాడుకి వస్తారేమోనన్న కోణంలో, ముందస్తు జాగ్రత్త చర్యలూ చేపడుతున్నారట.

జూనియర్ ఎన్టీయార్ ఎలాగూ రాడు.. ఆయన ఫొటోలతో కూడిన ప్లకార్డులు, జెండాలు.. ఏవీ రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారట నిర్వాహకులు. అదిరిందయ్యా చంద్రం.!