రీ పోలింగ్ పై కోర్టుకెక్కిన టిడిపి..చంద్రబాబులో  టెన్షన్ ?

రాష్ట్ర చరిత్రలో ఇంత వరకూ జరగని విచిత్రానికి తెలుగుదేశంపార్టీ పాల్పడింది.  రీ పోలింగ్ కు ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఆదేశాలపై టిడిపి కోర్టును ఆశ్రయించింది. మొన్నటి ఎన్నికల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో టిడిపి రిగ్గింగ్ కు పాల్పడిందని వైసిపి అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేశారు.

తన ఫిర్యాదుకు ఆధారంగా చెవిరెడ్డి వీడియో ఫుటేజిని కూడా అందించారు. వీడియోలను పరిశీలించిన తర్వాతే ఎన్నికల కమీషన్ ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరిపించాలని నిర్ణయించింది.  ఈ నెల 19వ తేదీన  రీ పోలింగ్ కు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.

ఎన్నికల కమీషన్ నిర్ణయంతో చంద్రబాబునాయుడుకు ఒళ్ళుమండిపోయింది. ఈసి ఏకపక్ష నిర్ణయాలతో రీ పోలింగ్ జరుపుతోందంటూ మండిపడ్డారు. ఢిల్లీలో ఎన్నికల కమీషన్ ను  చంద్రబాబు కలిసినపుడు తమ దగ్గరున్న వీడియో ఫుటేజీలను చూపింది.

దాంతో ఏమాట్లాడాలో తెలీక తెల్లమొహం వేసిన చంద్రబాబు బయటకు వచ్చేసి రీ పోలింగ్ పై కోర్టులో కేసు వేయాలంటూ నేతలను ఆదేశించారు. దాంతో ఎలక్షన్ కమీషన్ నిర్ణయంపై టిడిపి నేతలు వెంటనే కోర్టులో కేసు వేశారు.

సరే టిడిపి కేసంటూ వేసిన తర్వాత ఎన్నికల కమీషన్ కూడా సమాధానం చెప్పాల్సిందే కదా. అదేదో కమీషనే చూసుకుంటుంది. అయినా ఓ ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరపాలని ఎన్నికల కమీషన్ నిర్ణయిస్తే చంద్రబాబు ఎందుకింతగా ఆందోళన పడిపోతున్నారో అర్ధం కావటం లేదు.