శింగనమలలో టీడీపీ, వైసీపీలకు షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్..!

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యింది. ఈ పదేళ్ల కాలంలో ఎక్కడ కూడా పార్టీ జాడ కనిపించలేదు. ఎట్టకేలకు కాంగ్రెస్ నుంచి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం నమోదు అవ్వబోతుందంటూ రాజకీయ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో బలంగా వాదన వినిపిస్తుంది. అదే శింగనమల సీటు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ పీసీసీ ప్రెసిడెంట్‌ అయిన శైలజానాథ్ కి ఇక్కడి ఓటర్లు జై కొట్టే అవకాశాలు క్లీయర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైకాపా మరియు తెలుగు దేశం కూటమి అభ్యర్థులు తమ ఓటమిని అంగీకరించినట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందు మాట్లాడుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలం అయితే పుంజుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టిన తర్వాత చాలా వరకు మార్పు వచ్చింది. మెల్లగా కాంగ్రెస్ పుంజుకుంటుంది అనే చర్చ జరుగుతుంది. అయితే ఇతర స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు పై నమ్మకం లేదు కానీ శైలజానాథ్ విషయంలో మాత్రం చాలా స్పష్టత ఉందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కూటమి మరియు వైకాపా ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్న విషయం తెల్సిందే. రెండింటి మధ్య అధికారం దోబూచులాడే స్థాయిలో సీట్లు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంది. కానీ శింగనమల లో మాత్రం త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ముందు ఆ రెండు పార్టీలు నిలిచే పరిస్థితి లేదు అంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఏ పార్టీ సర్వే చేయించినా కూడా శింగనమల లో కాంగ్రెస్ గెలుపు తధ్యం అన్నట్లుగానే ఫలితాలు వస్తున్నాయట. అందుకే అక్కడ కూటమి మరియు వైకాపా కు చెందిన ముఖ్య నాయకులు ప్రచారం చేయకుండా మొహం చాటేస్తున్నారు అనేది ఇన్ సైడ్‌ టాక్‌.

మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత ఏపీ అసెంబ్లీలో మొదటి సారి ప్రాతినిధ్యం దక్కించుకోబోతుంది. ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కినా కూడా రాబోయే ఎన్నికలకు అది అత్యంత కీలకం అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. శింగనమల లో అధికార వైకాపాతో పాటు ప్రతిపక్ష టీడీపీకి శైలజానాథ్ రూపంలో కాంగ్రెస్ గట్టి షాక్‌ ఇవ్వడం కన్ఫర్మ్‌.