చంద్రబాబు అరెస్ట్‌ పై రియాక్షన్… నిర్మాత సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. మరోపక్క ఇతర కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లపై వాదనలు జరుగుతున్నాయి.

అయితే… చంద్రబాబు అరెస్ట్ విషయంలో టీడీపీ – వైసీపీ నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. బాబు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ నేతలు వాదిస్తుండగా… పక్కా ఆధారలున్నాయని, ఇది తీగ మాత్రమే అని, ఇంకా చాలా డొంకే ఉందని వైసీపీ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ సమయంలో సురేష్ బాబు స్పందించారు.

చంద్రబాబు అరెస్ట్ పై సినిమా ఇండస్ట్రీ నుంచి ఆశించిన స్థాయిలో రియాక్షన్ లేదని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్న వేళ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉందని స్పష్టం చేశారు.

తాజాగా “సప్త సాగరాలు దాటి” అనే సినిమా ప్రెస్‌ మీట్‌ లో పాల్గొన్న దగ్గుబాటి సురేష్ బాబును, చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాలని కోరగా ఆయన స్పందించారు. పరిశ్రమ ఎప్పుడూ రాజకీయంగా ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదని.. ఎందుకంటే ఇండస్ట్రీ జనాలు రాజకీయ నాయకులో, మీడియానో కాదని అన్నరు.

ఇదే సమయంలో తాము సినిమాలు నిర్మించడానికి వచ్చాం, సినిమాలు తీస్తాం అని చెప్పిన సురేష్ బాబు… తనను అడిగితే చిత్ర పరిశ్రమ రాజకీయాల ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదని అనుకుంటున్నానని అన్నారు.

ఇదే క్రమంలో… “చాలామంది ముఖ్యమంత్రులు పరిశ్రమకి చాలా చేశారు. చెన్నారెడ్డి గారు అయితే చాలా హెల్ప్ చేశారు, తర్వాత ఎన్టీ రామారావు గారు చేశారు. చంద్రబాబు గారు కూడా చిత్ర పరిశ్రమకి చాలానే చేశారు. ఈ సమయంలో చిత్ర పరిశ్రమ స్పందించటం లేదు అన్నది కరెక్టు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయిడు అరెస్టు అనేది సున్నితమైన ఇష్యూ” అని స్పష్టం చేశారు.

దీంతో ఇకపై ఇండస్ట్రీ జనాలనుంచి, ముఖ్యంగా పెద్ద పెద్ద హీరోల నుంచి, దర్శకులు, నిర్మాతల నుంచి చంద్రబాబు అరెస్ట్ పై రియాక్షన్స్ వస్తాయని ఊహించుకోనవసరం లేదన్న మాట. కాగా.. చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటివరకూ రాఘవేంద్ర రావు, అశ్వినీదత్, నట్టికుమార్ లు మాత్రమే రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.