నటి సుమలత చిన్న కోర్కె, కాంగ్రెస్ కు పెద్ద సమస్య

ఇటీవల మరణించిన కన్నడ నటుడు అంబరీష్ భార్య, నటి సుమలత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, తనకు కాంగ్రెస్ టికెట్ వస్తుందని కూడా ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, అక్కడి జనతా దళ్ ఎస్ ల మధ్య నడుస్తున్న సీట్లు పంపకం వివాదం వంటి విషయాలు తనకు అవసరం లేదని, తాను కాంగ్రెస్ పార్టీతరఫునే పోటీ చేస్తానని ఆమె అన్నారు. అయితే, ఆమె కోరతున్న మాండ్య టికెట్ విషయంలో ఆమెకు ఒక చిక్కు సమస్య ఎదురవుతున్నది.

అంబరష్ చురుకుగా రాజకీయాల్లో ఉన్నా సుమలత మాత్రం ఎపుడూ రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. అయితే, మూడు నెలల కిందట అంబరీష్ చనిపోయాక భర్త వారసత్వం కొనసాగించాలని అభిమానుల నుంచి వత్తిడి మొదలయింది. చాలా కాలం ఈవిషయం లో మౌనంగా ఉన్నా ఇపుడామె రాజకీయ ప్రవేశంమీద నిర్ణయం ప్రటించారు. పోటీ చేస్తానని చెప్పేశారు. అయితే, ఆమె పోటీ కాంగ్రెస్- జెడిఎస్ మధ్య వివాదం సృష్టించే అవకాశం ఉంది.

కర్నాటకలో అంబరీష్ చాలా పేరున్న నటుడు. బలమయని అభిమాన సంఘాల నెట్ వర్క్ కూడా ఉంది. అంబీరీష్ కావేరి జిలాలలో సుసంపన్నమయిన మాండ్య జిల్లాకు చెందిన వాడు. అందుకే సుమలతా కూడా మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అంబరీష్ మూడో మాసికం సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అభిమానుల వత్తిడికి తలొగ్గాల్సి వస్తున్నదని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించకున్నట్లు చెప్పారు. ‘అంబరీష్ రాజకీయజీవితమంతా కాంగ్రెస్ లోనే సాగింది. మా మిత్రులు, బంధువులు కాంగ్రెస్ లో నే ఉన్నారు. అందువల్ల నేను కాంగ్రెస్ నుంచ పోటీ చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా నాకు టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నాను,’అని సుమలత చెప్పారు.
ఫిబ్రవరి 20 వ తేదీన ఆమె కాంగ్రెస శాసన సభా పక్ష నాయకుడు సిద్దరామయ్యను కలిశారు. తాను పోటీ చేయాలనుకుంటున్న అభిలాష వ్యక్తం చేసి, తనకు మాండ్య టికెట్ కేటాయించాలని కోరారు. సిద్ధరామయ్య నుంచి ఇంకా స్పందనరాలేదు. ఎందుకంటే, ఆమె అడుతున్నది చిన్న కోర్కె కాదు.  దేవేగౌడ వంటి పెద్దమనిషి మనవడి  రాజకీయ ప్రవేశం కోసం రిజర్వు చేసుకున్న సీటు అది. ఇప్పటికే ఈ విషయాన్ని కుమారస్వామి, దేవేగౌడ చాలా సార్లు దీనిని స్పష్టంగా వ్యక్తీకరించారు. ఇలాంటి సీటను మా కివ్వండని దేవేగౌడను అడగటమే కష్టం…

అయితే, సమస్య ఏమిటంటే మాండ్య నుంచి ముఖ్యమంత్రి హెచ్ డి కుమార స్వామి కుమారుడు పోటీ చేయించాలనుకుంటున్నారు. మనవడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి, ఢిల్లీకి పంపాలనుకుంటున్నట్లు ఆ మధ్య మాజీ ప్రధాని, కుమారస్వామి తండ్రి దేవే గౌడ కూడా చెప్పారు. దానికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్య జిల్లాలోని ఏడు అసెంబ్లీ సీట్లన్ను జనతా దళ్ ఎస్ గెల్చుకుంది. అందువల్ల మాండ్య లోక్ సభ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్ల అవగాహన కింద కాంగ్రెస్ కు వదలుకోవద్దని జెడిఎస్ కార్యకర్తలనుంచి వత్తిడి వస్తున్నది. అందువల్ల సుమలత వత్తిడి వల్ల కాంగ్రెస్, జెడిఎస్ ల మధ్య మాండ్య వివాదం రాజుకునే పరిస్థితి ఉంది. మరి ఎలా?

సుమలతకు కాంగ్రెస్ టికెట్ రానిపక్షంలో ఆమె వెనక్కు తగ్గకుండా, మరొక పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.