సోము వీర్రాజు. బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టాలనేది ఆయన చిరకాల వాంఛ. ఎప్పుడో ఎన్నికలకు ముందే తనకు ఈ పదవి దక్కుతుందని ఆయన భావించారు. అయితే ఇప్పటికి కానీ అది ఫలించలేదు. ఆర్ ఎస్ ఎస్ భావజాలాన్ని అణువణువునా నింపుకొన్న సోము.. ఎట్టకేలకు బీజేపీ పగ్గాలు చేపట్టారు. అయితే ఆయన అత్యంత తక్కువ సమయంలోనే కేంద్ర బీజేపీ పెద్దల వ్యూహానికి వ్యతిరేకంగా వెళ్తున్నారనే భావన వ్యక్తమవుతోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో సోము అధికారాలకు కత్తెర పడిందని చెబుతున్నారు.

రాష్ట్రం ఏదైనా.. ఎక్కడైనా.. జాతీయ పార్టీల వ్యూహాలు.. ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా ఉండాలనేది బీజేపీ వ్యూహం. ఏపీ విషయానికి వస్తే.. ఈ వ్యూహం ఎక్కడో బెడిసి కొడుతోంది. ఇక్కడ కీలకమైన కమ్మ సామాజిక వర్గాన్ని కలుపుకొని వెళ్లడంలో సోము వీర్రాజు విఫలమవుతున్నారని అంటున్నారు. ఇక – రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరుతామని.. కాపు నాయకుడే సీఎం అవుతారని కూడా ఆయన చెబుతూ వచ్చారు. అదేసమయంలో ప్రధానంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సిన సోము.. ప్రతిపక్షాన్ని లక్ష్యం చేసుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు.
గతంలో జనసేనాని పవన్ ఇలానే చేశారు. అధికారంలో ఉన్న చంద్రబాబును వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్ను విమర్శించేవారు. ఇప్పుడు బీజేపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని కొన్నాళ్లుగా విమర్శలు వచ్చాయి. ఇక పార్టీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకున్న సోము, దీనిలోనూ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కడా చోటు కల్పించక పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ విషయంపై దృష్టి పెట్టిన కేంద్రంలోని బీజేపీ నాయకులు.. రాష్ట్రంలో ఎన్టీఆర్ కుమార్తె – కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ఊహించని పదవి ఇచ్చారు. నిజానికి సోము వీర్రాజు దాదాపు ఆమెను పక్కన పెట్టేశారని వార్తలు వచ్చిన తరుణంలో కేంద్రం ఇలా వ్యవహరించడం సంచలనమే.
ఈ పరిణామాలను గమనిస్తే.. సోము వీర్రాజు దూకుడుకు ఎక్కడో బ్రేకులు పడ్డట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. నిన్న మొన్నటి వరకు ఆయన ఓ రేంజ్లో విమర్శలు గుప్పించినా.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. సైలెంట్ అయిపోయారు. ఏదేమైనా.. ప్రస్తుతం పరిస్థితి బీజేపీలో చర్చనీయాంశంగా మారిందనడంలో సందేహం లేదు.
