వైరల్ గా “శంషాబాద్ ఎయిర్ పోర్ట్” సెల్ఫీ చాలెంజ్!

తన పాదయాత్రలో భాగంగా… సెల్ఫీ ఛాలెంజ్ స్టార్ట్ చేశారు నారా లోకేష్. తమ పార్టీ అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సెల్ఫీ తీసి.. జగన్ సర్కార్ కు ఛాలెంజ్ లు విసురుతున్నారు. ఈ క్రమంలో… సెల్ఫీల్లో ఉన్నవి తప్ప, మిగిలిన అభివృద్ధంతా వైఎస్సార్ చేసిందే అంటూ సమాధానమిస్తున్నారు వైసీపీ నేతలు. ఆ సంగతి అలా ఉంటే… ఈ సెల్ఫీ ఛాలెంజ్ ల వల్ల పార్టీకి ఎంత ప్లస్సో తెలియదు కానీ.. ఉన్న పరువు కూడా పోయేలా ఉందనే కామెంట్లు మొదలైపోయాయి.

సెల్ఫీ ఛాలెంజ్ లంటూ గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో… టీడీపీ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధంలేని అభివృద్ధి కార్యక్రమాలను కూడా సెల్ఫీ లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు టీడీపీ నేతలు. వీరి అజ్ఞానంతో కూడిన అత్యుత్సాహంతో… చంద్రబాబు పరువు పోతుంది. ఫేక్ ప్రచారాలు చేసుకుని బ్రతుకుతున్న బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్ లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుని చంద్రబాబు కట్టారంటూ తమ్ముళ్ళు అతి ఉత్సాహంతో సెల్ఫీలు తీసుకున్నారు. ఇది బాబు మార్కు అభివృద్ధి అని.. హైదరాబాద్ లో బాబు చేసిన అభివృద్ధిలో ఇదొకటని రాసుకొచ్చారు. దీంతో… షాకింగ్ రిప్లై లు ఇస్తూ… బాబు పరువు తీస్తున్నారు నెటిజన్లు. ఇంతకంటే దిగజారొద్దని టీడీపీ కేడర్ కు సూచిస్తున్నారు.

కారణం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2008లో ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగింది. అప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇలా సీఎం గా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించబడిన ఈ ఎయిర్ పోర్టుని.. చంద్రబాబు కట్టారంటూ సెల్ఫీలు తీసుకోవడం అంటే పరువు తక్కువ కాదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకా నయం… గోల్కొండ కోట వైపు టీడీపీ కార్యకర్తలు వెల్లకపోవడం అదృష్టం అంటూ సెటైర్స్ పేలుస్తున్నారు.

కాగా… బేగంపేట ఎయిర్ పోర్టుకి బదులుగా వైఎస్సార్ సీఎం గా ఉండగా ఈ విమానాశ్రయం నిర్మించబడింది. దీనికోసం సుమారు 5500 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఇంతటి సువిశాలమైన ప్రాంతంలో రికార్డ్ స్థాయిలో నిర్మితమైన ఈ ఎయిర్ పోర్ట్.. 2008 మార్చి 23న అప్పటి సీఎం వైఎస్సార్ నేత్రుత్వంలో ప్రారంభమైంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరుని ఈ ఎయిర్ పోర్టుకు పెట్టారు. జీఎమ్మార్ సంస్థ ఈ ఎయిర్ పోర్టుని నిర్మించింది.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… ప్రపంచంలో ఉన్న టాప్ టెన్ ఎయిర్ పోర్టులలో ఇది ఒకటిగా ఉండడం. అంతేకాకుండా… దేశంలోని బీజీయెస్ట్ టాప్ టెన్ ఎయిర్ పోర్టులలో కూడా… దేశంలో ఇది నాలుగవది కావడం.! ఇంతటి గొప్ప ఎయిర్ పోర్టుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నిర్మిస్తే… ఇది తమ చంద్రబాబు ఖాతాలో నిస్సిగ్గుగా వేసేస్తున్నారు తమ్ముళ్ళు! ఫలితంగా… ఈ సెల్ఫీ ఛాలెంజ్ ల వల్ల పార్టీకొచ్చే మైలేజ్ సంగతేమో కానీ… చంద్రబాబుకు ఉన్న పరువు కూడా పోతుందని అంటున్నారు విశ్లేషకులు!