ఖైదీలకు వర్క్ ఫ్రం హోం… ఏఏజీ పొన్నవోలు సంచలన వ్యాఖ్యలు!

రోజుకి కోటి రూపాయలు ఇచ్చి ఢిల్లీ నుంచి సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ లూథ్రా ను తెచ్చుకున్నా… నెలకి లక్షన్నర రూపాయల జీతం తిసుకునే ఏఏజీ పొన్నవోలు వాదన గెలిచింది.. అంటే న్యాయానికి రెమ్యునరేషన్, ఫీజు పరిగణలోకి రావు అని తేటతెల్లమైంది అనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

బేసిక్ లా నాలెడ్జ్ వున్నవారెవరూ ఎఫ్.ఐ.ఆర్. లో తన పేరు లేదు కాబట్టి తన అరెస్ట్ అనైతికం అనే స్థాయిలో మాట్లాడతారని… ఎఫ్.ఐ.ఆర్. లో ఫస్ట్ ఏ పేర్లు ఉన్నా.. విచారణలో అసలు పేర్లు బయటకు వస్తే అరెస్ట్ తప్పదని తెలిపారు. ఇదే సమయంలో… చంద్రబాబు వేసిన హౌస్ అరెస్ట్ పిటిషన్ పైనా ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

షుగర్, బీపీ ఉంది కాబట్టి ఇంటిలోనే ఖైదు చేయాలని అడగడం అంత అమాయకత్వం మరొకటి లేదన్నట్లుగా పేర్కొన్న ఆయన… ఈ ప్రస్తుత సమాజంలో నూటిని 90శాతం మందికి బీపీలు, షుగర్ లు కామన్ అయిపోయాయని అన్నారు. అవి ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఉంటాను అనడం కరెక్ట్ కాదని తెలిపారు. ఈ లెక్కన మాట్లాడితే బీపీ, షుగర్ ఉన్నవారిని జైల్లో పెట్టకూడదనే చట్టం చేసేస్తే సరిపోతుందని అన్నారు!

ఇదే సమయలో ఇదేమైనా వర్క్ ఫ్రం హోం ఆ అని ఘాటుగా రియాక్ట్ అయిన ఆయన… జైల్ సిస్టంస్ లో కూడా ఖైదీలకు వర్క్ ఫ్రం హోం పెడతారా మీరు అని ప్రశ్నించారు. ఇదే సమయంలో అరెస్ట్ చేసే సమయంలో 51 సీఆర్పీసీ అనే నోటీసు ఉంటుందని, అందులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టారని, అందులో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే విషయం స్పష్టంగా ఉందని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో కొమ్ములు తిరిగిన న్యాయవాదులను తెచ్చినందుకు వారు అడిగిన ప్రతీ దానికి సమాధానం చెప్పడం వల్ల అంత సమయం విచారణ జరిగిందని తెలిపిన ఆయన… వారి వాదనలో పసలేదు, తన వాదనలో పస ఉందనే కదా చంద్రబాబుని రిమాండ్ కి ఇచ్చారని గుర్తు చేశారు.