కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా ల పై ఫైర్ అయ్యారు. ఆదివారం గాంధీ భవన్ లో జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశం రసాభాసాగా సాగింది. దీంతో సర్వే సత్యనారాయణ ఉత్తమ్ కుంతియా లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సర్వే పై క్రమశిక్షణా చర్యల కింద పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారు. దీని పై సర్వే సత్యనారాయణ సోమవారం హైదరాబాద్ లో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“దళితుడినైనా జనరల్ సీట్లో గెలిచాను. నన్ను తీసేసే అధికారం కుంతియా, ఉత్తమ్ కు ఎక్కడిది. అసలు మీకు బుద్ధి, జ్ఞానం ఉందా నా పై చర్యలు తీసుకోవాలంటే అధిష్టానం తీసుకోవాలి. నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి నివేదిక ఇస్తాను. తెలంగాణలో జరిగిన పరిణామాలన్ని వివరిస్తాను. నేను చస్తే సోనియా గాంధీ దగ్గరే చస్తాను. వీళ్లు ఎవరు నన్ను తీసేసేందుకు. నేను ఏఐసిసి మెంబర్ ని. నన్ను సోనియా రాహుల్ సస్పెండ్ చేస్తే అప్పుడు పార్టీ నుంచి పోతా కానీ ఏ సంబంధం లేని వారు చేస్తే నేను పట్టించుకోను. నేను కాంగ్రెస్ లోనే ఉంటాను.
నన్ను అసెంబ్లీలో ఓడించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నించారు. పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఫండ్ ఇచ్చింది. దానిని ఏ అభ్యర్ధికి కూడా ఇవ్వలేదు. నన్ను, భట్టి విక్రమార్కలను ఓడించేందుకు కుట్ర పన్నారు. టికెట్లు అమ్ముకున్న వారే సమీక్షలు చేస్తారట. గెలిచిన కేసీఆర్, ఆయన కుటుంబం కష్టపడుతున్నారు. ఓడిపోయిన ఉత్తమ్ రివ్యూలతో కాలక్షేపం చేస్తున్నారు. దళితుడినైనందుకే నా పై చర్య తీసుకున్నారు. పార్టీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించడం తప్పా. అందరి బాగోతాలు తెలుసు. పార్టీ పెద్దలకు చెబుతా.
అసెంబ్లీ ఎన్నికల సమయాన పార్టీ ఇచ్చిన డబ్బు ఎక్కడపోయింది. ఎన్నికల సమయాన ప్రజలల్లోకి వెళ్లి తిరగకుండా గాంధీ భవన్ ల కూర్చొని ప్రెస్ మీట్ లు పెట్టారు. కూర్చుంటే లేవరు.. లేస్తే కూర్చొరు. అటువంటి వాళ్లు పార్టీలో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క ఎన్నికలోనైనా పార్టీ విజయం సాధించిందా. కుంతియా వచ్చి పోయేటందుకే తప్పా దేనికి పనికి రాడు. హోటళ్లలో కూర్చొని మీటింగ్ ల పేరుతో పైసలు వృథా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయాలంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తప్ప మరేవరికి లేదు.” అని సర్వే అన్నారు.
