చంద్రబాబుకు మెంట‌ల్ స‌ర్టిఫికెట్… హింట్ ఇస్తున్న రోజా!

చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చిన విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేతలు కానీ, వారి అనుకూల మీడియా కానీ నోరు మెదపలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు. సమాధానం తప్ప అన్నీ చెబుతున్నారన్ని కామెంట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ఏపీ మంత్రి రోజా మైకందుకున్నారు.

చంద్రబాబునాయుడు, లోకేష్ లపై వెటకారం ఆడే విషయంలో తనదైన శైలి చూపించే మంత్రి రోజా… మరోసారి విరుచుకుపడ్డారు. రూ.118 కోట్లకు సంబంధించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఐటీశాఖ ఇచ్చిన నోటీసుల‌పై చంద్రబాబు డొంక తిరుగుడు మాట‌లు మాట్లాడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అస‌లు ఆయ‌న ఆలోచ‌న ఏంట‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఈ నేప‌థ్యంలో చంద్రబాబునాయుడిపై మంత్రి ఆర్కే రోజా త‌న‌దైన స్టైల్‌ లో బాబును రాజ‌కీయంగా చిత‌క్కొట్టే కార్యక్రమానికి తెరలేపారు. ఇందులో భాగంగా… ముడుపుల కేసులో ధైర్యంగా విచార‌ణ ఎదుర్కొంటారా? అని ప్రశ్నించారు. ఇప్పటికే దాదాపు అన్ని కేసుల్లోనూ స్టేలు తెచ్చుకుని నెట్టుకొస్తున్న చంద్రబాబు… ఈ విషయంలో అయినా విచారణ ఎదుర్కొనే దమ్ముందా అన్నట్లుగా రోజా సూటిగా ప్రశ్నించారు.

ఇదే సమయంలో కేసు విచారణ ఎదుర్కొనే ధమ్ము లేకపోతే చంద్రబాబుకు మరో హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు రోజా. అందులో భాగంగా… బామ్మర్దిలా మెంట‌ల్ స‌ర్టిఫికెట్ తెచ్చుకుంటారా? అచ్చెన్నాయుడిలా ర‌మేశ్ ఆస్పత్రిలో చేరుతారా? అని ప్రశ్నించారు. లేకపోతే… విజ‌య‌మాల్యా మాదిరిగా విదేశాల‌కు పారిపోతారా చంద్రబాబు? అని రోజా ప్రశ్నించారు.

దీంతో రోజా ప్రశ్నించారా.. లేక, చంద్రబాబుకు హింట్ ఇచ్చారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కారణం… గతంలో తుపాకీ కాల్పుల ఘటనలో చంద్రబాబు బామ్మర్ధి సినీ నటుడు బాలకృష్ణ మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! అయితే ఈసారి చంద్రబాబు కూడా అలాంటి ఆప్షన్ ఏమైనా ఎంచుకుంటారా అని రోజా ప్రశ్నించారన్నమాట.

ఇదే సమయంలో గతంలో ఈ.ఎస్.ఐ. మందుల కొనుగోలు వ్యవ‌హారంలో అక్రమాల‌కు పాల్పడి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో తాను ఫైల్స్‌ తో బాధ‌ప‌డుతున్నానంటూ ట్రీట్మెంట్ కోసం విజ‌య‌వాడ‌లో టీడీపీకి చెందిన ర‌మేశ్ ఆస్పత్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు! ఇది రోజా ఇచ్చిన మరో హింట్ అని అంటున్నారు నెటిజన్లు!