Golden Fish: కోనసీమ జిల్లాలో మత్స్యకారుల పంట పండింది. సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అత్యంత అరుదైన, ఖరీదైన ‘కచ్చిడి’ చేపలు (గోల్డెన్ ఫిష్) రెండు చిక్కాయి. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్లో నిర్వహించిన వేలం పాటలో ఈ చేపలు ఏకంగా రూ. 1,94,000 ధర పలికాయి.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లగా వారి వలకు ఈ రెండు అరుదైన చేపలు దొరికాయి. వీటిని వెంటనే అంతర్వేది హార్బర్కు తరలించి వేలం వేశారు. 35 కిలోల బరువు ఉండగా, ఇది రూ. 1.20 లక్షలకు అమ్ముడుపోయింది. 30 కిలోల బరువు ఉండగా, దీనికి రూ. 74 వేలు ధర లభించింది.
స్థానిక వ్యాపారి ఒకరు పోటీపడి ఈ చేపలను దక్కించుకున్నారు. అయితే, ఇవి రెండు ఆడ చేపలు కావడంతో ధర కొంత తక్కువ పలికిందని, అదే మగ చేపలు అయ్యుంటే వీటి ధర రూ. 4 లక్షల పైమాటే ఉండేదని మత్స్యకారులు చెబుతున్నారు.
కచ్చిడి చేపలను (శాస్త్రీయ నామం: ప్రొటోనిబియా డయాకాంథస్) మత్స్యకారులు ‘బంగారు చేప’గా పిలుస్తుంటారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండటానికి కారణాలు ఇవే. ఈ చేప గాల్ బ్లాడర్ను సర్జరీ తర్వాత వేసే కుట్ల దారాల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే పలు ఔషధాల తయారీలోనూ వీటిని వాడుతుంటారు. వైన్ తయారీ ప్రక్రియలో కూడా ఈ చేపల భాగాలను వినియోగిస్తారని సమాచారం. ఈ చేప మాంసం తింటే కంటి చూపు మెరుగుపడుతుందని, ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయని చెబుతారు.
ఈ చేపలు ప్రధానంగా హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్ మహా సముద్ర తీరాల్లో కనిపిస్తాయి. నదులు సముద్రంలో కలిసే ముఖద్వారాల వద్ద, అడుగున బురద లేదా బండరాళ్లు ఉన్న చోట ఇవి ఎక్కువగా నివసిస్తాయి. సాధారణంగా మే నుండి అక్టోబర్ మధ్య కాలంలో ఇవి గుడ్లు పెట్టడానికి తీర ప్రాంతాలకు వస్తుంటాయి.
అంతర్వేదిలో కొనుగోలు చేసిన ఈ చేపలను వ్యాపారులు పశ్చిమ బెంగాల్కు, అక్కడి నుండి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అరుదుగా దొరికే ఈ చేపలు చిక్కడంతో ఆ మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు.

