రామోజీ.. తెలుగు ప్రజల ఆస్తి.! ద్యావుడా ఇంత వైపరీత్యమా.?

నో డౌట్.. రామోజీరావు అంటే, ప్రముఖ పాత్రికేయుడు.. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, మీడియా మొఘల్, మార్గదర్శి అధినేత, ప్రముఖ సినీ నిర్మాత, రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే.! రామోజీరావు ప్రముఖ వ్యక్తి. రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తి కూడా. మీడియా వ్యాపారాన్ని వేరే లెవల్‌కి తీసుకెళ్ళినోడు.. చిట్‌ఫండ్ వ్యాపారంలోనే కాదు, పచ్చళ్ళ వ్యాపారంలోనూ కొత్త పుంతలు తొక్కిన ఘనుడు.!

అంతమాత్రాన, రామోజీరావు తెలుగు ప్రజల ఆస్తి ఎందుకవుతాడు.? తన వారసులకు ఆయన ఆస్తి అవుతాడేమో.! ఔను కదా, వేల కోట్ల.. లక్షల కోట్ల ఆస్తుల్ని సంపాదించిపెట్టాడాయన. ఆ ఆస్తిని ఆయన వారసులు అనుభవిస్తారుగానీ, తెలుగు ప్రజలకు ఆ ఆస్తిపాస్తులు దక్కుతాయా.? వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, రామోజీరావుకి చిడతలు కొట్టడం ప్రారంభించారు. మార్గదర్శిలో అక్రమాలు జరగలేదట, కేసుని న్యాయస్థానాలు కొట్టేస్తాయట.! కడిగిన ముత్యంలా రామోజీరావు బయటకు వస్తారట. జడ్జిమెంట్ ఇచ్చేశారు రాజుగారు, సో.. రామోజీరావు మీద కేసుల్ని ముందే ఎత్తేయడం మంచిది.!

మరీ కామెడీ అయిపోయింది న్యాయ వ్యవస్థ అంటే సోకాల్డ్ రాజకీయ నాయకులకి. ఏళ్ళ తరబడి ఈ కేసు నడుస్తూ వుందంటే, అందులో ‘జీవం’ వున్నట్టే కదా.! సరే, రామోజీ తప్పు చేయకపోతే, తప్పించుకోవడం ఆయనకు చాలా తేలిక. అది వేరే సంగతి.