నక్కతోక తొక్కిన ‘శ్యాంబాబు’… ‘శోభన్ బాబు’ని పట్టాడంట!

కొన్ని రోజుల క్రితం విడుదలయిన పవన్ కల్యాణ్ “బ్రో” సినిమా టాక్, కలెక్షన్స్ సంగతి కాసేపు పక్కపెడితే… సినిమాకు మించి శ్యాంబాబు క్యారెక్టర్ వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. అటు సినిమా కామెడీ పరంగానూ, ఇటు రాజకీయాల్లో ఆ పాత్ర హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో ఆ పాత్రలో నటించిన ఫృధ్వీ కి లక్కీ ఛాన్స్ దొరికిందని అంటున్నారు.

అవును.. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర తనను ఇమిటేట్ చేసేలా ఉందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తే… అబ్బే అలాంటిది ఏఈ లేదంటూ ఆ టీం యూనిట్ చెప్పుకున్నారు. చేసిన పనికి ఒప్పుకునే ధైర్యం లేనప్పుడు చేయడం ఎందుకంటూ ఆన్ లైన్ వేదికగా బ్రో యూనిట్ పై సెటైర్లు పేలాయి.

ఈ సమయంలో “శ్యాంబాబు” పాత్రకు కంటిన్యూషన్ లో భాగమో.. లేక, టైటిల్ రోల్ పోషించే సరికొత్త పాత్రో తెలియదు కానీ… పృథ్వీ రాజ్ కు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఇందులో భాగంగా.. “శోభన్ బాబు” పేరుతో రాబోతున్న కొత్త సినిమాలో “శ్యాంబాబు”పాత్ర ఏకంగా రెండు గంటలు ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయాలను స్వయంగా ఫృధ్వీ ఆన్ లైన్ వేదికగా వెల్లడించారు.

అవును… తన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ రచయిత, దర్శకుడు తనకొక బంపరాఫర్ ఇచ్చారని.. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర వన్ మినిట్ ఫైవ్ సెకన్స్ ఉంటే.. ఆయన చేయబోయే సినిమా శోభన్ బాబులో శ్యాంబాబు రెండు గంటలు ఉంటాడని తెలిపారు. ఇదే సమయంలో ఇది తనకు ఒక అద్భుతమైన అవకాశం అని.. ఇక, ఆ సినిమాకు సంబంధించిన రచయిత, బ్యానర్, అన్ని విషయాలు త్వరలోనే తెలియచేస్తానని ఫృధ్వీ తెలిపారు.

ఈ సందర్భంగా తన కెరీర్ ని మలుపుతిప్పే సినిమా శోభన్ బాబు అని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం… ఈ శ్యాంబాబు ని మరలా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు నటుడు ఫృధ్వీ.

కాగా… తాజాగా రాజకీయ నాయకులకు, ప్రభుత్వాలకూ సినిమాల గురించిన విషయాలు ఎందుకంటూ చిరంజీవి స్పందించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొడాలి నాని, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఘాటుగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.