వైభవంగా రామతీర్థంలో సీతారామలక్ష్మణ విగ్రహాల ప్రతిష్ట

విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని రామతీర్థం బోడికొండపై రాముడి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఆలయంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించాలని దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకోని , తిరుమలలో కోదండరాముని విగ్రహాలు తయారుచేయించారు.

Ramatertham Idols Prathistha

ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా రామతీర్థంలో గుర్తు తెలియని దుండగుల చేతిలో దెబ్బతిన్న విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాల ప్రతిష్ఠాపన నేడు జరిగింది. నేడు బాలాలయంలో ప్రతిష్ఠ జరిగింది. ఇప్పటికే ప్రత్యేక పూజలు ఉదయం నుండి నిర్విరామంగా సాగుతున్నాయి.

అష్టకలశ స్నపనం, పంచగవ్యం పూజలను నిర్వహించిన రుత్వికులు, ఆపై ప్రతిష్ఠ నిమిత్తం విగ్రహాలను బాలాలయానికి తరలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేదిక్ వర్శిటీ ప్రొఫెసర్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో దేవాలయ అర్చకులు ఈ ఉదయం 8.58 గంటలకు ప్రతిష్ఠను పూర్తి చేశారు. నాలుగు రోజుల క్రితం ఈ విగ్రహాలను తిరుపతి శిల్ప కళాశాల నుంచి తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. నీలాచలంపై కోదండ రామాలయం అభివృద్ధి పనులు పూర్తయ్యాక అక్కడ విగ్రహాలను పునః ప్రతిష్టింపజేస్తామన్నారు. అప్పటివరకు బాలాలయంలోనే స్వామివారికి నిత్యపూజలు కొనసాగనున్నాయి.