ఆంధ్రప్రదేశ్ పర్యటన నిమిత్తం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మధ్య ఆసక్తికర, సరదా సంభాషణ చోటుచేసుకుంది.
ప్రధానికి మంత్రి నారా లోకేశ్ను పరిచయం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్వారు. లోకేశ్ను చూసిన ప్రధాని మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చమత్కారంగా మాట్లాడారు. “లోకేశ్ చాలా బరువు తగ్గిపోయావు” అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాక, “త్వరలో మీ నాన్నలా తయారవుతావ్” అన్న మాట అని, లోకేశ్ను ఉద్దేశించి ప్రధాని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రధాని వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ చిరునవ్వులు చిందించారు. అనంతరం, లోకేశ్ను “గుడ్” అంటూ ప్రధాని మోదీ భుజం తడుతూ ముందుకు సాగారు.

కర్నూల్లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోగా, ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగత సమయంలోనే ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
శ్రీశైలం పర్యటన:
ప్రస్తుతం ఏపీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ… ఓర్వకల్లు నుంచి నేరుగా శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. సుమారు 50 నిమిషాల పాటు భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ప్రధాని గడపనున్నారు.
ఆ తర్వాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. సుమారు 40 నిమిషాల పాటు శివాజీ స్పూర్తి కేంద్రం ధ్యాన మందిరంలో ప్రధాని మోదీ గడుపుతారు. అనంతరం 1.30 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరి కర్నూలు బహిరంగ సభకి బయలుదేరి వెళ్లనున్నారు.

