Perni Nani: మున్సిపల్ అధికారులపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం: ‘2029లో వడ్డీతో సహా చెల్లిస్తాం’

Perni Nani: బందరులో పేదల ఇళ్ల కూల్చివేత ఉదంతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. మున్సిపల్ అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను నేలమట్టం చేయడంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావుల తీరుపై పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు ప్రతి అధికారి లెక్క తేలుస్తామని స్పష్టం చేశారు.

“కొల్లు రవీంద్ర చెప్పారని ఇళ్లు కూల్చేందుకు వచ్చిన సీఐలు, ఎస్సైలను మళ్లీ బందరుకే రప్పిస్తా. వారిని కాపలా పెట్టి, నీ (కొల్లు రవీంద్ర) ఇంటిని కూడా ఇదే రీతిలో కూల్చి చూపిస్తా. జేసీబీలు, గునపాలు తిరగబడితే ఎలా ఉంటుందో కమిషనర్ బాపిరాజుకు రుచి చూపిస్తాం.”- మాజీ మంత్రి పేర్ని నాని.

అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు ఎక్కడికి వెళ్లినా వదిలే ప్రసక్తే లేదని, అవసరమైతే తెలంగాణకు వెళ్లినా కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా తిరిగి రప్పిస్తానని హెచ్చరించారు. కూల్చివేతల్లో పాల్గొన్న ఏసీపీ ఇంటికి కూడా సరైన అనుమతులు లేవని, దాని సంగతి కూడా చూస్తానని పేర్కొన్నారు. ఈ కూల్చివేతలు కేవలం రాజకీయ కక్షతోనే చేస్తున్నారని, దీనికి వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని ధ్వజమెత్తారు.

పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మచిలీపట్నంలో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు ఇళ్లు కోల్పోయిన బాధితుల ఆవేదన, మరోవైపు మాజీ మంత్రి నేరుగా అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ చేసిన హెచ్చరికలతో బందరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికారులపై నాని చేసిన వ్యాఖ్యలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Jagan Create A Confusion In Kutami Govt Over MAVIGAN | Telugu Rajyam