మరో మూడు రోజులు… కాకినాడలో కల్యాణ్ కోరిక ఇదే!

పవన్ కల్యాణ్ వరుసగా మూడురోజుల పాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడలో పర్యటించారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారని చెబుతున్న కాకినాడ సిటీతో పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలుస్తుంది. ఇదే సమయంలో పవన్ ఈ జిల్లా విషయంలో బలమైన కోరికను కలిగి ఉన్నారని అంటున్నారు.

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల సీట్లు అత్యంత కీలకం! అందుకే పార్టీలన్నీ ప్రధానంగా ఈ రెండు జిల్లాలపైనా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటాయి. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా ఈ జిల్లాల నుంచి అత్యధిక స్థానాలు తీసుకోవాలని భావిస్తున్న పవన్ కల్యాణ్… ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో 8 స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నారని సమాచారం.

వచ్చే ఎన్నిక్కల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని.. అంతకంటే ముందు ప్రధానంగా జనసేన మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా కాపాడుకోవాలని పవన్ బలంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. తనతో పాటు ఎంతోకొంతమంది జనసేన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళ్లాలని, తమ స్వరం వినిపించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో 8 నియోజకవర్గాలపై దృష్టిసారించిన పవన్… తాను కూడా తూగో నుంచే పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇందులో భాగంగా వారాహియాత్రలో భాగంగా జరిగిన బిగ్ ఫైట్ అందరికీ గుర్తుండే ఊట్మూద్మి. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మధ్య భారీ మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మధ్యలో ముద్రగడ కూడా ఎంటరవ్వడంతో పవన్ సైలంట్ అయిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే పవన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిని గెలవనివ్వను అని చేసిన శపథాన్ని మాత్రం వదల లేదని అంటున్నారు.

దీంతో వారు వీరు ఎందుకు.. జనసేనకు కాస్త అనుకూలంగా ఉందని అనిపిస్తే.. కాకినాడ సిటీ నుంచి తానే బరిలోకి దిగాలని భావిస్తున్నారంట. దీంతో కాకినాడ సిటీలోని ప్రతీవార్డు గురించీ జనసేన నేతలతో చర్చించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో తాను అనుకున్నట్లుగా మిగిలిన 7 స్థానాల్లోనూ కచ్చితంగా జనసేన అభ్యర్థులే పోటీచేయాలని.. ఈ విషయంలో తగ్గేది లేదని సంకేతాలు పంపారని అంటున్నారు.

ఇందులో భాగం కాకినాడ సిటీలో పవన్ కల్యాణ్ పోటీ అనంతరం కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, పిఠాపురం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ జనసేన పోటీచేయాలని.. ఈ ఎనిమిది స్థానాలనూ గెలవాలని.. తాను పోటీచేస్తున్న ప్రభావం జిల్లా అంతటా ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నారంట. మరి పవన్ కోరిక ఉమ్మడి తూ.గో.లో ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.

కాగా… డిశెంబర్ 28, 29, 30 వరుసగా మూడురోజులు కాకినాడలో పర్యటించిన పవన్ కల్యాణ్… జనవరి మూడు తర్వాత వరుసగా మరో మూడు రోజులు కాకినాడలోనే పర్యటించబోతున్నారని అంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా తాను పోటీచేయాలని భావిస్తున్నారని చెబుతున్న కాకినాడ సిటీతో పాటు మిగిలిన 7 నియోజకవర్గాలపైనా ఫైనల్ లిస్ట్ రెడీ చేయానున్నారని సమాచారం.