Pahalgam Terror Attack: పహల్గాం దాడి తర్వాత అలర్ట్‌: ఏపీ, తెలంగాణలో 14 ప్రాంతాలు హైసెక్యూరిటీ జోన్

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడి తర్వాత దేశమంతా అలర్ట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను కేంద్రం అత్యంత గంభీరంగా తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ముఖ్య ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 14 కీలక ప్రాంతాలను హై అలర్ట్ జోన్‌లుగా ప్రకటించింది.

హైదరాబాద్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, కూకట్‌పల్లి, నాంపల్లి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, ట్యాంక్ బండ్ లాంటి ప్రాంతాల్లో భద్రతను ముమ్మరించారు. అలాగే ఏపీలో తిరుమల అలిపిరి, విశాఖ రామకృష్ణ బీచ్, విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, ఎం.జి. రోడ్ వంటి ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణించొద్దని సూచించారు.

ఈ ప్రాంతాల్లో ప్రత్యేక ఆక్టోపస్ బృందాలను మోహరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అనుమానాస్పద చలనం కనిపించిన వెంటనే చట్టపరమైన అధికారులను సంప్రదించాలని ప్రజలను కోరారు. ఇక, పహల్గాం దాడి చేసిన ఉగ్రవాదుల జాడ కోసం సోదాలు, సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. కథువా ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి.

ఈ ఉగ్రదాడి మాస్టర్ మైండ్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బహుమతిని కూడా ప్రకటించారు. నిందితుల ఊహాజనిత చిత్రాలను విడుదల చేసి, సమాచారం అందించిన వారికి 20 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. మరోవైపు కశ్మీర్‌లో అనుమానిత ఉగ్రవాద మద్దతుదారుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై కూడా కఠిన వైఖరి తీసుకుంది. పాక్ పౌరుల వీసాలను రద్దు చేసి, వారిని తక్షణమే వెనక్కి పంపాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దీనితో పాటు, సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గబోమని కేంద్రం స్పష్టం చేసింది. మొత్తం మీద పహల్గాం దాడి తర్వాత దేశంలో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం తో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Public Reaction On Pahalgam Incident || Ap Public Talk || Ind Vs Pak || Telugu Rajyam