గుంటూరు టీడీపీ కీలక నేతకి చంద్రబాబు షాక్

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ లో జరగవచ్చు. ఇప్పటి నుండే రాజకీయ పార్టీలు తమదైన శైలిలో జనాల్ని ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక అధినేతలు అభ్యర్థులపై దృష్టి సారించారు. సర్వేలు చేయించి మరీ గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించే పనిలో పడ్డారు. టికెట్ ఆశిస్తున్న నేతలు, వారి అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని ఒక నేతకు చంద్రబాబు షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కు చంద్రబాబు నాయుడు షాక్ ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న సతీష్ కు భంగపాటు కలగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయనపై ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసారు చంద్రబాబు. అయినా ఆయన తీరులో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఆయన్ని ఎన్నికల బరి నుండి తప్పించనున్నట్టు తెలుస్తోంది.

అన్నం సతీష్ ప్రభాకర్ గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఆయన వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈసారి ఆయనకీ టికెట్ ఇస్తే సానుభూతిని కూడగట్టుకుని నెగ్గుకొస్తాడా? అంటే కష్టమే అంటున్నారు సొంత పార్టీ అభిమానులే. ఎందుకంటే ఆయన మీద నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది అంటున్నారు. ఆయన అధికారంలో లేకపోయినా పార్టీ అధికారంలో ఉండటంతో అనధికారిక పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ఒక పుట్టినరోజు వేడుకలో అధికారిని దుర్భాషలాడి అతనిపై చేయి చేసుకోవటం, ఇంకోసారి జర్నలిస్టుపైన చేయి చేసుకోవడం పెద్ద దుమారమే రేపాయి.

ఈ విషయాలు సీఎం దృష్టికి వెళ్లడంతో తీరు మార్చుకోవాలని గట్టిగానే మందలించారు ఆయన. అయినా ఆయన తీరు మారలేదని, స్థానికంగా అధికారులతో కూడా దురుసుగా ప్రవర్తిస్తారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆయన మరో వివాదంలో అడ్డంగా బుక్కయ్యారు. ప్రభుత్వ భూములను బ్యాంకులో తనఖా పెట్టి పెద్ద మొత్తాన్ని రుణంగా పొందినట్టు వార్తలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలన్నిటి దృష్ట్యా అన్నం సతీష్ ని పక్కన పెట్టేందుకు సిద్ధం అయింది టీడీపీ అధిష్టానం. మరో ప్రత్యామ్న్యాయం కోసం వెతికే పనిలో పడిందని సమాచారం.