భువనేశ్వరి యాత్రలో పవన్ గెస్ట్ రోల్… జనసైనికులే జూనియర్స్?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైనప్పటినుంచీ ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. సుమారు 42 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న నేపథ్యంలో.. ఆయన ఇప్పట్లో బయటకు రారనే చర్చ టిడీపీ శ్రేణుల్లో మొదలైందని చెబుతున్నారు. దాదాపు ఇదే అభిప్రాయం చంద్రబాబు కూడా వ్యక్తం చేశారని.. దీంతో బాబు ఫ్యామిలీ మెంబర్స్ జనాల్లోకి వెళ్లబోతున్నారని అంటున్నారు.

స్కిల్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారనే సంగతి కాసేపు పక్కనపెడితే… తాజాగా ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీలో అనిశ్చితి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరోపక్క సీఎం జగన్ ఇప్పటికే ఎన్నికల కార్యాచరణ ఫిక్స్ చేసారు. ఈ సమయంలో నారా లోకేశ్ – పవన్ కల్యాణ్ భేటీ కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో “న్యాయం గెలవాలి” అనే భువనేశ్వరి యాత్ర కూడా చర్చనీయాంశం అవుతుంది.

అయితే… చంద్రబాబు ఆపేయాల్సి వచ్చిన “భవిష్యత్తుకు భరోసా” కార్యక్రమాన్ని నంద్యాలనుంచి తిరిగి చినబాబు ప్రారంభిస్తారని చెబుతుండగా… బాబు అరెస్ట్ వార్త విని మరణించారని చెబుతున్న వారి కుటుంబాలను భువనేశ్వరి ఓదార్చబోతున్నారని అంటున్నారు. ఈ సమయంలో భువనేశ్వరి చేపట్టబోయే యాత్ర, బహిరంగ సభలకు పవన్ కల్యాణ్ గెస్ట్ గా హాజరవ్వబోతున్నారని అంటున్నారు.

భువనేశ్వరి యాత్రలకు, సభలకు ఈ సందర్భంగా పవన్ క్రౌడ్ పుల్లర్ గా ఉపయోగపడతారనేది టీడీపీ పెద్దల వ్యూహంగా చెబుతున్నారు. పైగా పొత్తు ప్రకటన తర్వాత టీడీపీ ఏర్పాటు చేస్తున్న యాత్ర, సభ కావడంతో… ఒకే వేదికపై పొత్తు పార్టీలు రెండూ ఉంటే కార్యకర్తలకు కాస్త ఉత్సాహంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారంట.

అయితే… భువనేశ్వరి సభకు, యాత్రకు తొలి రోజు మాత్రమే పవన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తారని చెబుతుంటుండగా… జనసేన కార్యకర్తలు మాత్రం ఆ యాత్ర జరిగినన్ని రోజులూ టీడీపీ కార్య్కర్తకు తోడుగా ఉంటారని అంటున్నారు. ఈ మేరకు జనసైనికులు అని చెప్పబడే జనసేన పార్టీ కార్యకర్తలకు పార్టీ నుంచి ఆదేశాలు అందే అవకాశం ఉందని చెబుతున్నారు.