నందమూరి వారసుల ప్రేమకు బాబు రిటన్ గిఫ్ట్స్ రెడీ!

చంద్రబాబు.. నందమూరి ఫ్యామిలీని అవసరానికి వాడుకుని వదిలేస్తారని, వారికి పార్టీలో ఏమాత్రం విలువివ్వరని, బాలకృష్ణ అంటే వియ్యంకుడు కాబట్టి తప్పడం లేదని.. లేదంటే ఆయన పరిస్థితి కూడా హరికృష్ణ పరిస్థితి లాగానే మారేదని చెబుతుంటారు! అయితే… అదంతా అవాస్తవమని నిరూపించేపనికు పూనుకున్నారు చంద్రబాబు! ఇదే క్రమంలో… చంద్రబాబు గురించి ఇన్ని రకాల కామెంట్లు వినిపిస్తున్నా… కొంతమంది నందమూరి వారసులు మాత్రం ఆయనపై పూర్తి నమ్మకంగా ఉంటుంటారు. చంద్రబాబుకోసం బలవ్వడానికి కూడా సిద్ధపడుతుంటారు. వారి మనసుల్లో చంద్రబాబుపై అంత ప్రేమ! దీంతో… వారి ప్రేమకు రిటన్ గిఫ్ట్స్ రెడీ చేస్తున్నారట చంద్రబాబు!

అవును… జూనియర్ ఎన్టీఆర్ మినహా నందమూరి వారసుల్లో ఎవరొచ్చినా అక్కున చేర్చుకునే చంద్రబాబు…. తాజాగా నందమూరి సుహానిసీ, నందమూరి చైతన్య కృష్ణలను చేరదీయాలని, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అసెంబ్లీకి తీసుకెళ్లాలనీ.. ఫలితంగా నందమూరి వారసులంటే తనకు ఎంత ఇష్టమో ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తున్నారంట. అందులో భాగంగా.. వారికోసం రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించారని తెలుస్తుంది. అయితే… వాటిలో ఒకటి కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ కాగా.. మరొకటి వల్లభనేని వంశీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం!!

అవును… రాబోయే ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల నుంచి నందమూరి వార‌సులు పోటీ చేస్తార‌న్న ప్రచారం బాగా వినిపిస్తోంది. వాటిలో ఒకటి ఇప్పటికే బాలకృష్ణ సిట్టింగ్ గా ఉన్న హిందూపురం నియోజకవర్గం కాగా… మిగిలిన రెండూ కృష్ణా జిల్లాలోని ఒకప్పటి టీడీపీ కంచుకోటలైన గన్నవరం – గుడివాడ. విచిత్రం ఏమిటంటే… ఆ మూడు స్థానాల్లో… హిందూపురం మినహా రెండు స్థానాలూ ఒకప్పుడు టీడీపీ కంచుకోటలు కావొచ్చు కానీ… ప్రస్తుతం తెలుగుదేశంపార్టీ నేతలు, కార్యకర్తలు ఆల్ మోస్ట్ చేతులెత్తేసినవే కావడం గమనార్హం!

కాసేపు హిందూపురాన్ని పక్కనపెడితే… గుడివాడ, గన్నవరంలో టీడీపీకి గట్టి అభ్యర్థులు దొరకటంలేదు. ఉండటానికి తమ్ముళ్ళు చాలామందే ఉన్నా… వైసీపీ తరపున పోటీ చేయబోయే కొడాలి నాని, వల్లభనేని వంశీలను ధీటుగా ఎదుర్కొనే స్థాయి నేతలు దొరకడం లేదు! పార్టీలకతీతంగా వీరిరువురూ ఆ రెండు స్థానాల్లోనూ పాతుకుపోవడమే ఇందుకు కారణంగా చెబుతుంటారు.

అందుకనే ఈ రెండు నియోజకవర్గాల్లో నందమూరి కుటుంబ స‌భ్యుల‌ను దింపితే ఎలాగుంటుందనే ఆలోచన చంద్రబాబు మదిలో మొదలైందనే ప్రచారం పెరిగిపోతోంది. అందులో భాగంగానే గుడివాడ నుంచి సుహాసినిని, గన్నవరం నుంచి నందమూరి చైతన్య కృష్ణ ను పోటీకి నిలబెట్టాలని భావిస్తున్నారంట. ఈ విషయంలో బాలకృష్ణ కూడా సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో… వంశీపై పోటీకి తానుకూడా సిద్ధంగా ఉన్నట్లు చైతన్య కృష్ణ కూడా తెలిపారని అంటున్నారు!

మరి అదే జరిగితే… ఈసారి గన్నవరం – గుడివాడల్లో రసవత్తరపోరు జరగడం ఖాయం అని చంద్రబాబు అభిమానులు భావిస్తుండగా… ఇదే సమయంలో బాబుకు పరోక్షంగా థాంక్స్ చెబుతున్నారంట వైకాపా కార్యకర్తలు! దీంతో… మరోసారి నందమూరి వారసులను బాబు బలివ్వబోతున్నారని.. గతంలో కూకట్ పల్లిలో ఒకసారి సుహాసిని.. బాబు రాజకీయాన్ని రుచి చూసినా కూడా మరోసారి అందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు నేటిజన్లు. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు అభిమానులు రసవత్తర పోరుగా భావిస్తున్న ఈ పోటీలో.. గెలుపు ఎవరిని వరించనుందనేది వేచి చూడాలి!