ఈవిఎంలను హ్యాక్ చేశారా

40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు చివరకు ప్రజా శాంతి పార్టీ అధినేత కెఏ పాల్ ను ఫాలో అవుతున్నట్లున్నారు.  మొన్నటి వరకూ పాల్ చేసిన ఈవిఎంల హ్యాకింగ్ ఆరోపణలనే తాజాగా చంద్రబాబు కూడా అందుకున్నారు. మొన్నటి వరకూ ఈవిఎల పనితీరుపై మండిపడి, ఈవిఎంలు, ఎన్నికల కమీషన్ పై యుద్ధం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు ఇపుడు ఈవిఎంలు హ్యాకింగ్ అయినట్లు అనుమానం వ్యక్తం చేయటం విచిత్రంగా ఉంది.

చంద్రబాబునాయుడు తన రూటు మార్చారు. ఇంతకాలం ఈవిఎంల పనితీరుపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు తాజాగా రష్యన్ హ్యాకర్లు ఈవిఎంలను హ్యాకింగ్ చేశారంటూ కొత్త రాగం మొదలుపెట్టారు. అయితే ఈవిఎంల్లో ప్రోగ్రామింగ్ ను మార్చటం ద్వారా హ్యాకింగ్ చేయవచ్చని ముంబాయ్ లో చంద్రబాబు మండిపడ్డారు.

ఈవిఎంల హ్యాకింగ్ గురించి సుదీర్ఘంగా మాట్లాడిన  చంద్రబాబు ఏపిలో జరిగిన పోలింగ్ లో ఈవిఎంలు హ్యాకయ్యాయా ? లేకపోతే జాతీయ స్ధాయిలో జరుగుతున్న పోలింగ్ లో ఈవిఎంలు హ్యాక్ అవుతున్నాయా ? అన్న విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మొన్న అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఈవిఎంల హ్యాకింగ్ ఆరోపణలను ఈ సందర్భంగా ట్యాగ్ చేశారు.

కోట్ల రూపాయలు ఇస్తే ఈవిఎంలను హ్యాక్ చేస్తామంటూ కొన్ని బృందాలు తిరుగుతున్నట్లు కూడా చెప్పారు. మరి ఆ విషయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారా లేదా అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.  ఈవిఎంలకు అనుసంధానంగా ఉండే వివి ప్యాట్లను లెక్కించటమే సందేహాల నివృత్తికి ఏకైక మార్గంగా చెప్పారు.  సరే చంద్రబాబు తర్వాత మాట్లాడిన శరద్ పవార్ మాత్రం ఈవిఎంల పనితీరు తప్ప తమ విజయంలో ఎటువంటి సందేహం లేదని సింపుల్ గా తేల్చేశారు.