రైతుపై రెవిన్యూ అధికారుల జులుం (వీడియో)

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి తహసీల్డార్ కార్యాలయంలో పాసు పుస్తకాల పంపిణీలో రగడ జరిగింది. పాసు పుస్తకాలు ఇవ్వకుండా లంచం డిమాండ్ చేసి వేదిస్తున్న ఎమ్మార్వోను కడుపు మండిన రైతు చొక్కాపట్టి నిలదీశాడు. సీఎం కేసీఆరే చెప్పారుగా మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే చొక్కా పట్టుకుని నిలదీయండి అని.. అదే పని ఆ రైతు చేశాడు. దీనికి ప్రతిఫలం ఏమిటో తెలుసా.. ఆ రైతును రెవిన్యూ అధికారులు చితకబాది ఓ క్రిమినల్ లా పోలీసులకు పట్టించారు.

ఎల్కతుర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన రైతు రాజయ్యకు చెందిన భూమి వివాదాలలో ఉంది. రైతు బంధు పథకంలో భాగంగా అందరు రైతులకు పాసుపుస్తకాలు వచ్చాయి కానీ రాజయ్యకు చెందిన భూమికి పాసుపుస్తకం రాలేదు. తన భూమికి సంబంధించిన వివాదాలన్ని పరిష్కారమయ్యాయని తన భూమికి సంబంధించిన పాసుపుస్తకాలు ఇవ్వాలని రాజయ్య ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. అది కోర్టు పరిధిలో ఉందని చెబుతూ ఆపుకుంటూ వచ్చారు. తర్వాత లంచం ఇస్తే పనైపోతుందని చెప్పారు. దీంతో తాను లంచం ఇచ్చుకోలేనని పేదవాడినని వారి కాళ్ళవేళ్లా పడ్డా అధికారి కనికరించలేదు. ఎమ్మార్వో మల్లేష్ ని నిలదీయగా ఎమ్మార్వో నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన రైతు ఎమ్మార్వో గల్లా పట్టుకున్నాడు. అంతే… క్షణంలో అక్కడున్న రెవిన్యూ సిబ్బంది రైతును ఈడ్చుకెళ్లి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి రైతును అరెస్టు చేశారు.

రైతుపై జరిగిన దాడిని రైతు సంఘాలు, విపక్షాలు ఖండించాయి. లంచాలు డిమాండ్ చేయడమే కాకుండా రైతుపై దాడులు చేస్తారా అంటూ వారు ధ్వజమెత్తారు. దీనిపై నిజనిర్దారణ కమిటి వేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై కలెక్టర్ అమ్రపాలికి ఫిర్యాదు అందినట్టు తెలుస్తుంది. దీంతో ఆమె విచారణ చేయనున్నట్టుగా తెలుస్తుంది. రైతుపై జరిగిన దాడి పట్ల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం కేసీఆర్ రైతులకు కన్నీరు లేకుండా చేయాలని రైతుబంధు పథకం ప్రవేశపెట్టారు. ఏ రైతు కూడా రూపాయి లంచం ఇవ్వాల్పిన అవసరం లేదని, మీ ఇంటికే అధికారులు పట్టాలు తీసుకొచ్చి ఇస్తారని గొప్పలు చెబుతుంటే రెవిన్యూ అధికారులు మాత్రం లంచాల ఆశలో రైతుల రక్తం తాగుతున్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటనపై సీఎం కేసీఆర్, ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి…