మంత్రిని వేలూ కాలూ పెట్టొందంటున్న ఎమ్మెలే టీం!

వైసీపీ ఎమ్మెల్యేలందు మైలవరం ఎమ్మెల్యే వేరయా అంటున్నారట వైసీపీ శ్రేణులు. స్వపక్షంలోనే విపక్షం డైలాగులు పేల్చిన ఆయన.. తన నియోజకవర్గంలో ఆయనకంటూ సొంతపార్టీలోనే ఒక విపక్షం ఉందని చెబుతున్నారు. పైగా వారికి బ్లేడ్ బ్యాచ్, చెడ్డీ గ్యాంగులు, తొట్టి గ్యాంగులు అంటూ ముద్దుపేర్లు పెట్టుకుంటూ ఫీలవుతున్నారు!

మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ అలకమీద ఉన్నారు.. తనవరకూ అమరావతే రాజధాని అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఈయన పరిస్థితి ఇలా ఉందేంటని భావించిన జగన్.. పిలిచి మాట్లాడారు. ఆనాటి నుంచి మళ్లీ సాధారణ స్థితికి వచ్చిన క్రిష్ణప్రసాద్… కొంతకాలం మామూలుగానే ఉన్నా.. మళ్లీ మొదటికి వచ్చారు. తనకు సొంతపార్టీలోనే ఒక విపక్షం తయారయ్యిందని అంటున్నారు. దీంతో.. క్రిష్ణ ప్రసాద్ చెబుతున్నది మంత్రి జోగి రమేష్ టీం గురించే అనేది స్థానికంగా వినిపిస్తున్న మాట!

అవును… తాజాగా మైలవరం నియోజకవర్గంలో జి.కొండూరు మండలంలోని డీసీసీ బ్యాంక్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. తనకు సొంత నియోజకవర్గంలోనే విపక్షం తయారయ్యిందని.. అది కూడా సొంత పార్టీలోని వారేఅని చెబుతున్నారు. తనను అనే ధైర్యం విపక్షాలకు లేదని చెబుతున్న ఆయన… సొంత పార్టీలో వారే కోతి మూకల మాదిరిగా మారి చేస్తున్న చర్యలను ఎవరూ పట్టించుకోవద్దని వసంత అంటున్నారు.

ఇక ఆయనతో పాటు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు కూడా వసంతకు మద్దతుగా మాట్లాడారు. పక్క నియోజకవర్గం వ్యవహారాల్లో తమ ఎమ్మెల్యే వేలూ కాలూ పెట్టరని.. అవతల వారూ కూడా అలాగే ఉండాలి తన్నీరు డైలాగు పేల్చారు. దీంతో వసంత క్రిష్ణ ప్రసాద్ & కో లు అంటున్న మాటలు అన్నీ మంత్రి జోగి రమేష్ మీదనే అని ఫిక్సవుతున్నారు కార్యకర్తలు. మరి ఈ విషయాలపై జోగి & కో ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి!

YouTube video player