తప్పు కదా.! ఉద్యోగితో చెప్పులు మోయించడమేంటి మంత్రి రోజాగారూ.!

రాజకీయాల్లో పద్ధతుల గురించీ, నీతుల గురించీ, చిత్తశుద్ధి గురించీ, సభ్యత అలాగే సంస్కారం గురించీ గట్టిగా మాట్లాడేస్తుంటారు మంత్రి రోజా. కానీ, అవేవీ ఆమె పాటించరు. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో హద్దులు మీరుతుంటారు. వ్యక్తిగత విమర్శలూ చేస్తారు. కానీ, రోజాని ఎవరూ విమర్శించకూడదు. విమర్శించారో, ఆమె ‘మహిళా కార్డు’ తెరపైకి తెస్తారు.

అసలు విషయానికొస్తే, సినీ నటి అలాగే నగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత, మంత్రి రోజా ఓ ఉద్యోగితో చెప్పులు మోయించారు. సూర్యలంక బీచ్ అభివృద్ధి విషయమై పర్యాటక శాఖ మంత్రి హోదాలో సమీక్ష నిర్వహించారు రోజా. ఈ నేపథ్యంలోనే ఆమె బీచ్‌లో అధికారులతో కలిసి తిరిగారు. నడుస్తూ నడుస్తూ.. చెప్పులు విడిచి, ఆ చెప్పుల్ని పట్టుకోవాలంటూ ఓ ఉద్యోగికి హుకూం జారీ చేశారు. ‘జీ హుజూర్8 అనుకుంటూ సదరు ఉద్యోగి (ఏపీ టూరిజం శాఖకి సంబంధించిన వ్యక్తి) ఆ చెప్పుల్ని తీసుకుని, మంత్రిగారిని అనుసరించారు.

‘చెప్పులు పట్టుకోవాలని రోజా చెప్పడం.. ఆ ఉద్యోగి చెప్పులు పట్టుకుని తిరగడం..’ ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మంత్రిగార్ని ఏకి పారేస్తోంది. మంత్రి రోజా ఈ వ్యవహారంపై ఎలా కవరింగ్ ఇచ్చుకున్నా సరే, అది మాత్రం క్షమార్హం కాదన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. ఉద్యోగులంటే మంత్రులకు సేవకులు కాదు. వారిని అలా భావించడం మంత్రులకు తగదు.