Nara Lokesh Tirupati Visit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఆధ్యాత్మిక నగరం తిరుపతికి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు.
నేడు రాక.. ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బస:- మంత్రి లోకేశ్ ఈరోజు రాత్రికి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో తిరుపతిలోని ఎస్.వి. ఆటోనగర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు వెళ్తారు. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు.

రేపటి అభివృద్ధి కార్యక్రమాల షెడ్యూల్:- మంత్రి లోకేశ్ తన పర్యటనలో రెండో రోజైన రేపు ఉదయం వరుస ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. సుమారు రూ.10.20 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను మంత్రి మొదటగా ప్రారంభిస్తారు. అనంతరం చంద్రగిరి నియోజకవర్గానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ స్థానిక బాలుర కళాశాల ప్రాంగణంలో రూ.3.20 కోట్లతో నిర్మించిన నారా రామ్మూర్తి నాయుడు క్రీడా ప్రాంగణాన్ని, ఇండోర్ స్టేడియంను ఆయన జాతికి అంకితం చేస్తారు.
కార్యకర్తలతో భేటీ:- క్రీడా ప్రాంగణాల ప్రారంభోత్సవం అనంతరం మంత్రి తిరిగి తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి గ్రామీణ మండలం తనపల్లి కూడలి వద్ద ఉన్న రామానాయుడు గార్డెన్స్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి లోకేశ్ కీలక ప్రసంగం చేయనున్నారు.
మంత్రి పర్యటన దృష్ట్యా స్థానిక యంత్రాంగం మరియు పార్టీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

