Nara Lokesh Bengaluru Visit: ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం బెంగళూరు చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బెంగళూరు టీడీపీ ఫోరం ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, నినాదాలతో విమానాశ్రయ ప్రాంగణం సందడిగా మారింది.
బెంగళూరు సర్జాపూర్లోని ప్రముఖ విద్యాసంస్థ గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించనున్న ఐబీడీపీ (IBDP) గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించిన లోకేష్, ఇటువంటి అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బెంగళూరు పర్యటనకు ముందు మంత్రి లోకేష్ రోజంతా అత్యంత బిజీగా గడిపారు.
రాష్ట్ర కేబినెట్ భేటీ: ఉదయం అమరావతిలో జరిగిన ఏపీ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ కీలక నిర్ణయాలపై చర్చించారు.
కేబినెట్ సబ్ కమిటీ: అనంతరం రామాయపట్నం పోర్టు అభివృద్ధి పనులపై సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కూడా పాల్గొన్నారు.
గన్నవరం నుంచి ప్రయాణం: అధికారిక సమావేశాలు ముగిసిన వెంటనే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బెంగళూరుకు బయలుదేరారు.
నేటి పర్యటన ముగించుకుని ఆయన తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.

