రోజా వర్సెస్ లోకేష్.! హద్దులు దాటుతున్న మాటల యుద్ధం.!

మంత్రిని పట్టుకుని ‘జబర్దస్త్ ఆంటీ’ అని ఎలా అనగలుగుతున్నారు నారా లోకేష్.? ‘యువగళం’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. రోజా సొంత నియోజకవర్గం నగిరిలో పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ, స్థానిక ఎమ్మెల్యే అలాగే మంత్రి కూడా అయిన రోజాపై విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు నారా లోకేష్. రోజా, ఆమె సోదరులు నగిరితోపాటు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నది నారా లోకేష్ ఆరోపణ.

దోపిడీ ఆరోపణలు రాజకీయాల్లో మామూలేగానీ, ‘జబర్దస్త్ ఆంటీ’ అంటూ మంత్రిని ఉద్దేశించి లోకేష్ అనడం సబబు కాదు. అయితే, నారా లోకేష్ మీద మంత్రి రోజా చేసే విమర్శలతో పోల్చితే ‘జబర్దస్త్ ఆంటీ’ అన్న వ్యాఖ్య అత తీవ్రమైనదేమీ కాదన్న వాదనా లేకపోలేదు. ఇక, ‘జబర్దస్త్ ఆంటీ’ విమర్శలపై మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. ‘పప్పు.. తుప్పు..’ అంటూ విరుచుకుపడ్డారు రోజా. ‘హెరిటేజ్ ఆంటీ..’ అంటూ నారా లోకేష్ తల్లి భువనేశ్వరిపై మండిపడ్డారు రోజా. అంతేనా, భువనేశ్వరి – బ్రాహ్మణి మధ్య గొడవలున్నాయనీ, కొట్టుకుంటున్నారని రోజా ఆరోపించారు.

అసలు నారా లోకేష్ పాదయాత్రలో జనం లేరనీ, మంగళగిరి మాలోకాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ అంటోన్న వైసీపీ.. ఎందుకు నారా లోకేష్ విషయంలో ఇంతగా ఉలిక్కిపడుతోందన్న ప్రశ్న తెరపైకొస్తోంది. మొత్తమ్మీద, నారా లోకేష్ పాదయాత్రకి వైసీపీ నేతల తీవ్ర విమర్శల కారణంగా ఫ్రీ పబ్లిసిటీ వస్తోందని అనుకోవాలేమో.!