చంద్రబాబుకు సన్ స్ట్రోక్… సీటుకోసం చినబాబు చుట్టూ నేతలు!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర జోరుగా సాగుతోంది. చాలావ‌ర‌కూ ఆ నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు యువ‌గ‌ళం స‌మ‌న్వయ క‌మిటీల‌తో కోఆర్డినేట్ చేసుకుని ఈ యాత్రను నిర్వహించుకుంటున్నారు. జ‌న‌స్పంద‌న, తాదినికి అనుగుణంగా మీడియా స్పందన సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ సందర్భంగా లోకేష్ ముందు ధరఖాస్తులు పట్టుకుని నిలబడుతున్నారంట టీడీపీ నేతలు.

పాద‌యాత్ర సాగే ఆయా నియోజ‌క‌వ‌ర్గాలల్లో టీడీపీ నేతలు చినబాబు దర్శనకోసం తెగ తాపత్రయపడుతున్నారంట. పాద‌యాత్రకి స్థానిక నేతలు తప్ప బ‌య‌ట నుంచి నేత‌లు ఎవ‌రూ రావొద్దని లోకేష్‌ తోపాటు స‌మ‌న్వయ క‌మిటీ నిర్వాహకులు కూడా సూచిస్తున్నారట. యువ‌గ‌ళంలో భాగంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గంలో ప్రజ‌ల స‌మ‌స్యలు తెలుసుకోవ‌డానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌ని, బ‌య‌ట రాజ‌కీయాల పంచాయతీలకు సమయం కుదరదని చెబుతున్నారంట.

అయితే అయితే ఇవేమీ ప‌ట్టించుకోని కొంతమంది టీడీపీ నేత‌లు త‌మ ఆధిప‌త్యాన్ని ప్రద‌ర్శించ‌డానికి యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ని వాడుకోవాల‌ని చూస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… ఎవరికైతే స్థానికంగా వారి వారి నియోజకవర్గాల్లో కాస్త ప్రాభవం తక్కువగా ఉందో.. ఎవరికైతే చంద్రబాబు టిక్కెట్ విషయంలో కన్ ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారో.. వారంతా చినబాబు ముందు వాలిపోతున్నారని తెలుస్తుంది.

అవును… టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇటీవ‌ల శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ ల‌క్ష్మీదేవి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా గొండు శంక‌ర్ రెబ‌ల్‌ గా మారి సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు. క‌ట్ చేస్తే గొండు శంక‌ర్ యువ‌గ‌ళం పాద‌యాత్రలో పాల్గొని లోకేష్‌ తో ఫొటోలు దిగి ఆయ‌న ఆశీస్సులు త‌న‌కేనంటూ బిల్డప్ ఇచ్చుకుంటున్నారు.

ఇదే క్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ పార్టీ ఇన్చార్జికి చెప్పకుండా సొంతంగా కార్యక్రమాలు చేప‌డుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. ప్రవీణ్ కి షోకాజ్ నోటీసు ఇచ్చారు. వెంట‌నే భాష్యం ప్రవీణ్ యువ‌గ‌ళం పాద‌యాత్రలో ప్రత్యక్షమ‌య్యారు. లోకేష్ ఆశీస్సులు త‌న‌కి ఉన్నాయ‌నేలా యువ‌గ‌ళం పాద‌యాత్ర నుంచి సంకేతాలు పంపారు.

ఎచ్చెర్ల టికెట్ ఆశిస్తున్న క‌లిశెట్టి అప్పల‌నాయుడు త‌న‌కి ఉన్న ప‌రిచ‌యాల‌తో ప్రకాశం జిల్లాలో సాగుతున్న పాద‌యాత్రలో లోకేష్‌ ని క‌లిశారు. దాన్ని పెద్ద ఎత్తున‌ప్రచారం చేసుకుంటున్నారు. ఏ ప‌ద‌వీ లేని క‌లిశెట్టి అప్పల‌నాయుడు లోకేష్‌ ని క‌లిస్తే.. టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడిని అంటూ మాజీ మంత్రి కిమిడి క‌ళా వెంక‌ట‌రావు పాద‌యాత్రలో ప్రత్యక్షమ‌య్యారు. యువ‌నేత‌ని వ‌ద‌ల‌కుండా న‌డుస్తూ దిగిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌దిలారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వైరల్ చేసుకుంటున్నారు.

తో ఇవన్నీ చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయని అంటున్నారంట. ఎవరికైతే చంద్రబాబు టిక్కెట్ కన్ ఫాం చేయడం లోదో వారంతా చినబాబు ముందు వాలిపోతున్నారంట. మా భవిష్యత్తు మీరేనని, టీడీపీ ఆశాజ్యోతి తమరే అని భజనకు తెరతీస్తున్నారంట. దీంతో చంద్రబాబుతో పాటు సీనియర్లు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది.