అవినీతికి ఫ్యాంటు షర్టూ వేస్తే… చంద్రబాబుపై ర్యాగింగ్ పీక్స్!

జాతీయ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం… చంద్రబాబుకి ఐటీ నోటీసుల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు ఎవరూ స్పందించలేదు.. ఇదే క్రమంలో టీడీపీ అనుకూల మీడియా కూడా నోటీసుల వ్యవహారాన్ని పట్టించుకోలేదు. దీంతో వైసీపీ నుంచి ర్యాగింగ్ స్టార్ట్ అయ్యింది.

అవును… ఐటీ నోటీసుల వ్యవహారంపై చంద్రబాబు అండ్ కో పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించింది. టీడీపీ నుంచి కనీసం ఆ వార్తను ఖండిస్తున్నట్లు కానీ… అది తప్పుడు వార్త అని వాదించే దిశగా కానీ స్పందన రాలేదు. దీంతో సహజంగానే వైసీపీ నేతల నుంచి ర్యాగింగ్ మొదలైంది.

ఇందులో భాగంగా పేర్ని నాని, అమర్నాథ్ లు చంద్రబాబుకి కౌంటర్లిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ విషయంలో ఎవరి స్థాయిలో వారు వెటకారం ఆడుతూ చంద్రబాబు & కో ను ఒక ఆటాడుకున్నారు.

ఈ క్రమంలో ముందుగా స్పందించిన పేర్ని నాని… ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమో కాదో చెప్పాలని సూచించారు. చంద్రబాబు గుట్టంతా ఐటీ అధికారులు బయటపెట్టారని.. దీంతో ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేశారనేది బహిర్గతమైందని అన్నారు.

సరిగ్గా సెప్టెంబర్ 1వ తేదీనే ఎన్టీఆర్‌ నుంచి సీఎం కుర్చీని చంద్రబాబు లాక్కున్నారని గుర్తు చేసిన పేర్ని నాని… సరిగ్గా అదే రోజు చంద్రబాబు అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని అన్నారు. దీంతో… ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోందని తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలని ఛాలెంజ్ విసిరిన పేర్ని నాని… లోకేష్ తన పాదయాత్రను కాసేపు ఆపి, తన తండ్రి అవినీతి బాగోతంపై స్పందించాలని సూచించారు. సపోజ్ ఆ ఆరోపణలు తప్పు అనుకుంటే హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రికపై పరువునష్టం దావా వేసే దమ్ము లోకేష్ కి ఉందా అని ప్రశ్నించారు.

ఈ రేంజ్లో చంద్రబాబు, లోకేష్ లపై తనదైన శైలిలో స్పందించిన పేర్ని నాని… తాజాగా భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ చంద్రబాబు సంతకంతో వస్తోన్న లేఖలపైనా స్పందించారు. గతంలోనూ ఇలాంటి లేఖలు ఇచ్చారని… అప్పుడు ఆ లేఖపైన పవన్ ఫోటో, కింద చంద్రబాబు సంతకం ఉందని ప్రజలకు చూపించారు.

అనంతరం మంత్రి అమర్నాథ్ మైకందుకున్నారు. ఈ సందర్భంగా… అవినీతికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబులా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇపప్టివరకూ చేసిన తప్పులకు చంద్రబాబు శేష జీవితంలో ఫలితం అనుభవించక తప్పదని తెలిపారు. అవినీతి వ్యవహారాల్లో కాపాడమని కేంద్రంలోని పెద్దల కాళ్లు మొక్కడానికే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని అన్నారు.

అనంతరం… హెరిటేజ్ పాల ఉత్పత్తుల వ్యాపారం కోసం చంద్రబాబు పిండింది అవుపాలో గేదె పాలో కాదని తెలిపిన అమర్ నాథ్… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాను పిండుకున్నారని అన్నారు. ఇందులో భాగంగానే కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల రూపంలో కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టారని విమర్శించారు.