మహిళలే వైసిపిని ఆదుకున్నారా ?

మొన్నటి ఎన్నికల్లో మహిళ ఓట్లన్నీ తెలుగుదేశంపార్టీకే పడ్డాయని చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారు. పసుపు-కుంకుమ ఓట్లు టిడిపికి పడిన కారణంగా మళ్ళీ తమకే అధికారమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవం మాత్రం మహిళల ఓట్లలో అధికశాతం వైసిపికి పడ్డాయని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇంతకీ వాస్తవం ఏమిటి ?

విషయం ఏమిటంటే పసుపు-కుంకుమ పథకంలో దాదాపు 98 లక్షల మహిళలున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. పోలింగ్ రెండు రోజుల ముందే వీరిలో చాలామందికి ప్రభుత్వం తరపున వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. సరే ఇదికూడా ఓటుకునోటు లాంటిదే అనుకోండి అది వేరే సంగతి. డబ్బులు తీసుకున్నారు కాబట్టి మహిళల ఓట్లు తమకే అన్నది టిడిపి ధీమా.

అయితే ఎగ్జిట్ పోల్ సర్వేలు చేసిన సంస్ధల్లో ఆరా అనే సంస్ధ ఒకటుంది. ఇపుడీ సంస్ధ చేసిన సర్వే ఫలితాలు అంతటా వైరల్ అవుతోంది. ఆ సంస్ధ లెక్క అయితే మహిళల ఓట్లు వైసిపికే ఎక్కువగా పడ్డాయట. మొత్తం మహిళల ఓట్లలో 47 శాతం వైసిపికి పడితే టిడిపికి పడింది 43 శాతమేనట. నాలుగు శాతం ఓట్లు తేడా అంటే మామూలు విషయం కాదు. పోయిన ఎన్నికల్లో గెలిచిన టిడిపికి, ఓడిన వైసిపికి మధ్య ఓట్ల తేడా కేవలం 1.6 శాతం మాత్రమే.

ఈ లెక్కన ఏకంగా 4 శాతం ఓట్లు వైసిపికి ఎక్కువగా పడ్డాయంటే అర్ధమేంటి ? అలాగే నెల్లూరు జిల్లాలోనే మహిళల ఓట్లు అత్యధికంగా పోలైనట్లు ఆ సంస్ధ చెబుతోంది. అదే సందర్భంలో నెల్లూరు జిల్లాలో వైసిపి క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా అంటోంది. అంటే జిల్లాలోని 10 సీట్లకు 10 సీట్లూ వైసిపి ఖాతాలోనే పడతాయని జోస్యం చెప్పింది. అదే నిజమైతే అన్నీ జిల్లాల్లోను పరిస్ధితి ఇంచుమించు ఇలాగే ఉంటుందనటంలో సందేహం లేదు.