జగనే నాకు దేవుడు..కొత్త డ్రామా కాదు కదా ?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు దేవుడితో  సమానమని నిందితుడు శ్రీనివాస్ తాజాగా కేకలు వేస్తు చెప్పటంపై అనుమానాలు పెరుగుతున్నాయి. పోలీసుల కస్టడీలో ఉన్న శ్రీనివాస్ తనకు చాతిలో నొప్పిగా ఉందని, ఎడమచెయ్యి లాగుతోందిన చెప్పటంతో పోలీసులు కెజిహెచ్ కు తరలించారు. ఆ సందర్భంగా అక్కడున్న మీడియాను ఉద్దేశించి నిందితుడు గట్టిగా కేకలు వేస్తు మాట్లాడారు. జగన్ తనకు దేవుడితో సమానమన్నారు. ప్రజల మనస్సుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ చిరస్ధాయిగా ఎలా ఉండిపోయారో జగన్ కు కూడా అలాగే ఉండిపోవాలన్నది తన కోరికగా చెప్పారు.

జగన్ పై చేసిన దాడి వెనుక ఎవరి ప్రోదల్భం లేదని, తానే బుద్దిపూర్వకంగా హత్యాయత్నం చేశానంటూ చెప్పటం గమనార్హం. తన ప్రాణాలు తీసి రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారని కూడా శ్రీనివాస్ వాపోవటం విచిత్రంగా ఉంది. ఇపుడు నిందితుడు ఏ విషయాలనైతే చెప్పాడో మొదటి నుండి వైసిపి నేతలు అవే చెబుతున్నారు. నిందితునితో తెరవెనుక ఉండి ఎవరో మాట్లాడిస్తున్నట్లు ఆరోపిస్తున్న విషయం కొత్తేమీ కాదు. నిందితునికి జగన్ నిజంగానే దేవుడితో సమానమైతే జగన ఫొటో పెట్టుకుని పూజించుకుంటారు కానీ చంపే ఉద్దేశ్యంతో కత్తితో దాడి చేస్తారా ?

ఇక, తన ప్రాణాలకు హాని ఉందని చెప్పటం కూడా ఆశ్చర్యంగా ఉంది. పోలసుల కస్టడీలో ఉన్న శ్రీనివాస్ కు ఏమన్నా జరిగితే అది పోలీసులదే బాధ్యతవుతుంది. తర్వాత చంద్రబాబునాయుడుకు చుట్టుకుంటుంది. ఎందుకంటే, శ్రీనివాస్ గనుక హత్యాయత్నినికి సంబంధించిన నిజాలు వెల్లడిస్తే పథకం సూత్రదారుల బండారం బయటపడుతుంది. దాంతో నేతల తలరాతలే మారిపోతుందనటంలో సందేహం లేదు.

అందుకనే ముందుజాగ్రత్తగా నిందితునితో పోలీసులే మాట్లాడించుంటారనే ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి. పైగా తాను దాడి చేస్తానన్న విషయం జగన్ కు కూడా తెలీదని చెప్పటం గమనార్హం. జరిగింది చూస్తుంటే శ్రీనివాస్ తో మాట్లాడించి జనాల్లో గందరగోళానికి పోలీసులే ప్రయత్నాలు చేస్తున్నారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. నిజాలేంటో ఆ శ్రీనివాసుడుకే తెలియాలి.