చంద్రబాబు హ్యాండ్..బుట్టాకు షాక్ ?

ఫిరాయింపు ఎంపి బుట్టాకు చంద్రబాబునాయుడు షాకిచ్చినట్లేనా ? ఇపుడిదే అంశం జిల్లాలో బాగా చర్చల్లో నలుగుతోంది. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున కర్నూలు లోక్ సభకు ఎన్నికైన బుట్టా రేణుక తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. ఏవో వ్యక్తిగత లబ్ది కోసమే బుట్టా పార్టీ ఫిరాయించారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వ్యక్తిగత లబ్ది ఏ మేరకు దక్కిందో తెలీదు కానీ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నుండి షాక్ తప్పదని దాదాపు తేలిపోయింది. కాంగ్రెస్ తో తెలుగుదేశంపార్టీ పొత్తులు పెట్టుకోవటంతో బుట్టాకు సమస్యలు మొదలయ్యాయి.

 

పార్టీ ఫిరాయించేటపుడు వచ్చే ఎన్నకల్లో మళ్ళీ ఎంపి టిక్కెట్టు హామీ పొందారు. ఆమధ్య కర్నూలు జిల్లాలో పర్యటించిన నారా లోకేష్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో బుట్టాను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన విషయం తెలిసిందే. అయితే, అక్కడి నుండి పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.  టిడిపిలోకి అయితే ఫిరాయించారు కానీ తర్వాత పార్టీ నేతల్లో ఎవరూ బుట్టాకు కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా బుట్టాను పిలవటం లేదు. పోనీ బుట్టా ఏదైనా కార్యక్రమం పెట్టుకుని పిలిచినా కూడా ఎవరూ వెళ్ళటం లేదు. అంటే పార్టీలో బుట్టాకు తీరని అవమానాలు ఎదురవుతున్నట్లు లెక్క. అన్నింటికీ క్లైమ్యాక్స్ గా కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవటమే బుట్టా కొంప ముంచుతోంది.

 

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు 25 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్ధానాలు ఇవ్వటానికి చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు ప్రచారం ఊపందుకుంటోంది. 5 లోక్ సభ సీట్లలో కర్నూలు కూడా ఒకటని సమాచారం. కర్నూలంటే కోట్ల సూర్యప్రకాశరెడ్డి కోసమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పొత్తలున్నాక కోట్ల పోటీ చేసే కర్నూలు పార్లమెంటు సీటును కాంగ్రెస్ ఎట్టి పరిస్ధితుల్లోను వదులుకోదు. ఆ విషయం తెలుసు కాబట్టే చంద్రబాబు కూడా కర్నూలును వదులుకోవటానికి సిద్దపడ్డారట. కర్నూలు లోక్ సభ సీటును వదులుకోవటమంటే బుట్టాకు హ్యాండ్ ఇస్తున్నట్లే అర్ధం.