ఆరు నెలల క్రితం లవ్ మ్యారేజీ, ఇప్పుడు భార్య హత్య

నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని తిప్పర్తి మండలంలోని మల్లెవారి గూడెంలో యువతి హాస్య ను దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు భర్త శ్రీనివాస్. పూర్తి వివరాలు చదవండి.

తిప్పర్తి మండలంలోని జంగారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెపల్లి వారి గూడెం గ్రామానికి చెందిన జంజర్ల శ్రీనివాస్, హాస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ గత ఆరు నెలల క్రితం హాస్య, శ్రీనివాస్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమించుకున్న సమయంలో హాస్యను పెళ్లి చేసుకునేందుకు శ్రీనివాస్ అంగీకరించకపోవడంతో హాస్య తన ప్రియుడైన శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. నాలుగు రోజులపాటు ధర్నా చేసింది. అయితే ఆ సమయంలో జిల్లాలోని మహిళా సంఘాలు, పోలీసులు, పెద్ద మనుషులు ఒప్పించి శ్రీనివాస్ కు, హాస్యకు పెళ్లి చేశారు.

అయితే ఇటీవల భార్య హాస్య గర్భం దాల్చింది. అది ఇష్టంలేకపోవడంతో అబార్షన్ చేయించుకోవాలంటూ భర్త శ్రీనివాస్ ఆమెపై వత్తిడి తెచ్చాడు. దీంతో ఆమె తన భర్తతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె పుట్టింట్లో ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన శ్రీనివాస్ అక్కడికి వెళ్లి భార్యతో గొడవపడ్డాడు. ఇదే సమయంలో మాట మాట పెరిగాయి. గర్భవతి అయిన హాస్య గొంతు కోసి హతమార్చాడు శ్రీనివాస్. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.

శ్రీనివాస్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.