గుడివాడ నియోజకవర్గం.. కొడాలి నాని పేరు చెప్పగానే గుర్తుకొచ్చే ప్రాంతం. ఓ సమయంలో నాని ఉంటేనే గెలుపు అన్నంతగా వైసీపీకి అక్కడ పట్టు ఉండేది. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత దృశ్యం పూర్తిగా మారిపోయింది. నానీ ఓటమితో పాటు పార్టీపై నమ్మకం కూడా క్రమంగా నశించిపోయింది. తాజా పరిణామాలు చూస్తుంటే గుడివాడ వైసీపీలో బలం గల్లంతవుతోందని స్పష్టంగా కనిపిస్తోంది.
తాజాగా మండలి హనుమంతరావు సహా సుమారు 500 మంది వైసీపీ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో చాలామంది కొడాలి నానీకి దగ్గరగా ఉన్న నేతలే. నానీ వైసీపీలోకి రాకముందే ఈ నేతలు పార్టీకి అండగా నిలిచారు. పార్టీ అభివృద్ధికి కష్టపడ్డారు. జగన్కు వీరాభిమానం చూపారు. అయినా నాయకత్వం పట్ల నిరాశ పెరిగింది. తాము చేస్తున్న కృషికి గుర్తింపు లేకపోవడం, నియోజకవర్గంలో వైసీపీ పతనం తేలిపోవడంతో వీరంతా వెనక్కి తగ్గారు.
ప్రస్తుతం గుడివాడలో టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేస్తున్న పనులు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. రాముతో సంబంధాలు పెంచుకుంటున్న హనుమంతరావు, ఆయన అభివృద్ధి విధానాలను మెచ్చుకుంటూ కనిపిస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి రాము చేస్తున్న ప్రయత్నాలు హనుమంతరావును టీడీపీకి మరింత దగ్గర చేశాయి. త్వరలోనే ఈ బృందం అధికారికంగా టీడీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.
ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే గుడివాడలో వైసీపీ పూర్తిగా బలహీనపడిందని అనిపిస్తోంది. కొడాలి నాని మళ్లీ యాక్టివ్ కాకపోతే పార్టీకి ఎదురైన నష్టాన్ని తిప్పుకోవడం కష్టం అనే అభిప్రాయం సైతం బయటపడుతోంది. పార్టీ కోర్ లీడర్లే దూరమవుతుంటే.. వైసీపీకి గుడివాడలో రాజకీయంగా మిగిలేది ఏముంటుందన్నది ప్రశ్నగా మారింది.