ఆంధ్రజ్యోతికి షాక్ ఇచ్చిన ప్రభుత్వం

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి పెద్ద షాకే ఇచ్చింది. రాష్ట్రంలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చేపనిలో పడింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఇప్పటికే రాష్ట్రమంతా అక్రమనిర్మాణాలను గుర్తింపు జరుగుతోంది. ఇందులో భాగంగానే కాకినాడలో అక్రమంగా నిర్మించిన ఆంధ్రజ్యోతి భవనాన్ని గుర్తించింది.

తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో రెండస్తుల్లో ఆంధ్రజ్యోతి భవనం నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండస్తులను ప్రింటింగ్ కోసం ఉపయోగిస్తున్నారట. ఎప్పుడు కట్టింది ? అనుమతులు ఎందుకు తీసుకోలేదు ? అన్న విషయాలు అధికారులు వివరించలేదు.

మొత్తం మీద నిబంధనలను విరుద్ధంగా నిర్మించారని మాత్రం గుర్తించారు. వెంటనే కూల్చివేతపై యజమానికి గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటి (గూడా) అధికారులు నోటిసులు కూడా ఇచ్చేశారు.  తమ నోటీసులకు వారంలోగా సమాధానం చెప్పాలని కూడా అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

క్రమబద్దీకరణ పథకం క్రింద అవసరమైన అనుమతులు తీసుకోవాలంటే యాజమాన్యం రూ. 70 లక్షలు చెల్లించాలట. అయితే ఆ విధంగా చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించటం లేదట.  అక్రమంగా భవనం నిర్మించిందే కాకుండా అనుమతులు తీసుకునేందుకు ఫైన్ కూడా కట్టనంటోంది. గూడా అధికారులు ఇచ్చిన నోటీసులు ఎండి వేమూరి రాధాకృష్ణ కూతురు అనూషకు ప్రొవిజనల్ ఆర్డర్ రూపంలో అందింది. మరి యజమాన్యం ఏం చేస్తుందో ? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.