“గీతం” యూనివర్సిటి డిగ్రీల చెల్లుబాటు పై గందరగోళం

తెలంగాణలో డీమ్డ్ యూనివర్సిటిల బీటెక్ డిగ్రీల గుర్తింపు పై వివాదం నెలకొంది. గీతం యూనివర్సిటిల డిగ్రీలు చెల్లవని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించడంతో వేలాది మంది విద్యార్దుల జీవితాలు అయోమయంలో పడ్డాయి.

విశాఖ కేంద్రంగా గీతం యూనివర్సిటి 2007 లో ప్రారంభమైంది. ఆ తర్వాత 2009లో హైదరాబాద్ కేంద్రంగా మరో యూనివర్సిటి ప్రారంభమైంది. 2014 లో గీతం యూనివర్సిటిలో ఓ విద్యార్ధిని బిటెక్ లో చేరి ఆమె కోర్పు  పూర్తి చేసింది. 2018లో ఆమె బిటెక్ పూర్తి కాగా ఎంబీఏ కరీంనగర్ లో ని ఓ కాలేజిలో మేనేజ్ మెంట్ కోటా కింద  జాయిన్ అయ్యింది. నిబంధనల ప్రకారం ఉన్నత విద్యామండలి అధికారులు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తారు. అయితే కాలేజి యాజమాన్యం విద్యామండలికి అమ్మాయి సర్టిఫికేట్లు పంపగా ఆ సర్టిఫికేట్లు చెల్లవని గీతం యూనివర్సిటికి అనుమతి లేదని తేల్చారు. దీంతో ఆ విద్యార్ధిని కంగుతిన్నది.

సాంకేతిక కోర్సులు నిర్వహించే వాటికి తప్పని సరిగా ఏఐసీటిఈ అనుమతి ఉండాలి. ఈ జాబితాలో తెలంగాణకు సంబంధించిన మూడు యూనివర్సిటిలు మాత్రమే ఉన్నాయి. ఐఐఐటి హైదరాబాద్, కేల్ యూనివర్సిటి, ఇక్ఫాయ్ వర్సిటిలు ఉన్నాయి. గీతమ్, సింఘానియా, ఎమిటీ, సింబియాసిస్, లకు అనుమతి లేదు. దీంతో గీతమ్ యూనివర్సిటిలో చేరిన విద్యార్దుల పరిస్థితి,  ఇప్పటి వరకు చదివి పాసైన విద్యార్ధులు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.

గీతం యూనివర్సిటి స్పందన

“గీతం యూనివర్సిటి అన్ని డిగ్రీలు చెల్లుతాయి. చట్టబద్దంగా అన్ని ప్రాసెస్ లు పూర్తి చేశాకే కేంద్రం అనుమతిచ్చింది. గీతంలో బిటెక్ చేసిన విద్యార్ధిని ఎంబీఏ లో ప్రవేశం పొందింది. ఆమె సర్టిఫికేట్లను చూసి ఆమె ప్రవేశాన్ని తిరస్కరించినట్టు తెలిసింది. ఆ విద్యార్ధి నష్టపోకుండా అన్ని సర్టిఫికేట్లు తెలంగాణ విద్యామండలికి సమర్పించాం. న్యాయవాది వివరణ కూడా తీసుకుంటాం. ఆ అమ్మాయికి నష్టం జరగనివ్వం. మిగతా విద్యార్దులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2007 నుంచి అన్ని అనుమతలు ఉన్నాయి.” అని గీతం అధికారి ఒకరు తెలిపారు.